లక్నో: ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం వినూత్న ప్రయోగం చేశాడు. బస్తీ జిల్లా భేడిహా గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న సూరజ్.. వ్యర్థాల నుంచి ప్లాస్టిక్ను వేరుచేసి దానితో మహాత్మాగాంధీ ప్రతిమను రూపొందించాడు.
ఈ ప్రతిమను పర్యావరణ దినోత్సవం సందర్భంగా బస్తీ జిల్లా కేంద్రంలో ఆవిష్కరించాలని భావించాడు. అయితే పెయింటింగ్ పూర్తి కాకపోవడంవల్ల అది సాధ్యం కాలేదు. కాగా, ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకే తాను ఈ ప్రయత్నం చేశాననని సూరజ్ పేర్కొన్నాడు. సాధారణంగా సూరజ్ వ్యర్థాల నుంచి ప్లాస్టిక్ను వేరుచేసి పునర్వినియోగ కేంద్రాలకు విక్రయిస్తుంటాడు.
అలా వచ్చిన సొమ్మును గ్రామ పంచాయతీకి విరాళంగా ఇస్తుంటాడు. ఇలా ఇప్పటివరకు రూ.17 వేలు అందించాడు. ఈ సారి మాత్రం అలా సేకరించిన ప్లాస్టిక్కు సిమెంట్, ఇనుము, గోనె సంచులను జోడించి గాంధీ విగ్రహాన్ని రూపొందించాడు. అంతేగాక గ్రామంలోని అనేక ప్రాంతాల్లో పూలమొక్కలను కూడా పెంచుతున్నాడు. అతడికి గ్రామ పంచాయతీ రూ.5,100 ప్రోత్సాహకంగా అందించగా అందులో రూ.4,100 గ్రామపంచాయతీకి విరాళంగా ఇచ్చాడు.