ఒకేరోజు 52 మంది మృతి
6,446 మంది డిశ్చార్జి
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొవిడ్-19 వైరస్ వ్యాప్తి పెరుగుతున్నది. రోజువారీ కేసుల సంఖ్య 10 వేలు దాటింది. సోమవారం ఒక్కరోజే 10,122 కేసులు నమోదుకాగా.. కరోనా, ఇతర కారణాలతో 52 మంది మరణించారు. కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అవుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం సానుకూలాంశం. సోమవారం రికార్డుస్థాయిలో 6,446 మంది కోలుకొని డిశ్చార్జి అయినట్టు మంగళవారం విడుదలచేసిన బులిటెన్లో వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో రికవరీ రేటు 82.68 శాతంగా, జాతీయ సగటు 82.5 శాతంగా నమోదైంది. యాక్టివ్ కేసుల సంఖ్య 70 వేలకు చేరువైంది. సోమవారం అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1440, మేడ్చల్ మల్కాజిగిరిలో 751, వరంగల్ అర్బన్లో 653, రంగారెడ్డిలో 621, నిజామాబాద్లో 498, నల్లగొండలో 469, ఖమ్మంలో 424, మహబూబ్నగర్లో 417 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారంనాటికి 25,906 పడకలు అందుబాటులో ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ప్రభుత్వ దవాఖానల్లో 7,937, ప్రైవేట్లో 17,969 పడకలు అందుబాటులో ఉన్నాయి.
రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులు
వివరాలు సోమవారం మొత్తం
పాజిటివ్ కేసులు 10,122 4,11,905
డిశ్చార్జి 6,446 3,40,590
మరణాలు 52 2,094
చికిత్స – 69,221