హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రోజువారీ కొవిడ్ కేసులను గణనీయంగా కట్టడి చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు సరిహద్దు రాష్ర్టాల నుంచి కరోనా వైరస్ ప్రవేశించకుండా నిరోధించడంపై దృష్టి సారించింది. గ్రామాల్లో ఎక్కడికక్కడ క్యాంపులు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. మరోవైపు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు జిల్లాల్లో పర్యటించి అక్కడి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. సరిహద్దు జిల్లాల్లో వైరస్ కట్టడి చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగం గా ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, సీఎం ఓఎస్డీ గంగాధర్, హెల్త్ డైరెక్టర్ జీ శ్రీనివాసరావు హెలికాప్టర్ ద్వారా ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించారు. ఖమ్మం, మధిర, సూర్యాపేట, కోదాడ తదితర ప్రాంతాలకు వెళ్లి కరోనా కట్టడికి అనుసరించాల్సిన వ్యూహం, చేపట్టాల్సిన చర్యల గురించి ఆయా జిల్లాల అధికారులకు వివరించారు. ఏ జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి? అధిక పాజిటివిటీ రేటు ఉన్న ప్రాంతాలేమిటన్న విషయాలపై సమీక్షించి వీలైనంత త్వరగా కేసులు తగ్గుముఖం పట్టేలా కృషి చేయాలని సూచించారు. ఇదేవిధంగా ఇతర రాష్ర్టాలతో సరిహద్దు పంచుకుంటున్న జిల్లాల్లోనూ పర్యటించి అక్కడి అధికారులను అప్రమత్తం చేయనున్నారు.
ప్రస్తుతం పట్టణాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ పలు సరిహద్దు జిల్లాల్లో పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నట్టు ఉన్నతాధికారులు గుర్తించారు. అందుకే గ్రామాన్ని యూనిట్గా తీసుకొని పటిష్ఠ చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రతి పీహెచ్సీలో రోజూ కనీసం వందకుపైగా కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఒక వైపు జ్వర సర్వే కొనసాగిస్తూనే మరోవైపు పీహెచ్సీ పరిధిలోని గ్రామంలో వారానికోసారి మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కరోనా క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ క్యాంపుల ద్వారా ప్రతి వారం గ్రామ ప్రజల ఆరోగ్య వివరాలను తెలుసుకొని వారికి అవసరమైన మందులను అక్కడే ఇవ్వనున్నారు. దీంతో పాటు కరోనా చికిత్స, మందులు, పౌష్ఠికాహారం తదితర అంశాలపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించనున్నారు. ఈ చర్యలతో సరిహద్దు జిల్లాల్లో కరోనా కేసులు పూర్తి స్థాయిలో
తగ్గుముఖం పడతాయని వైద్యాధికారులు
అభిప్రాయపడుతున్నారు.