పూర్తి కాని మిషన్ భగీరథ పనులు
మక్తల్ రూరల్, జూన్ 9 : కర్ని గ్రామంలో తరచు మంచినీటి సమస్య ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో మిషన్ భగీరథ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ప్రభుత్వం ప్రజలకు తాగునీటి కోసం కోట్ల వెచ్చించి ఖర్చు పెడుతున్నా కాంట్రాక్టర్ల అసమర్థత వల్ల పనులు సకాలంలో పూర్తి కావడం లేదు. దీంతో వారం రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో కొన్నేళ్లుగా మంచినీటి సమస్య నెలకొంది. గ్రామానికి సత్యసాయి తాగునీటి పథకం ద్వారా నీరు సరఫరా అవుతుండగా వారం కిందట పైప్లైన్ పగిలిపోయింది. దీంతో నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు నీళ్ల కోసం నానా తంటాలు పడుతున్నారు. ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా గ్రామ పంచాయతీ నుంచి నీటిని సరఫరా చేసుండటంతో ట్యాంకర్ల రాగానే బిందెలు పట్టుకుని పరుగెత్తుకుంటూ వెళ్లగానే సరిపడా నీళ్లు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు.
అసంపూర్తిగా ‘మిషన్ భగీరథ’
గ్రామంలో చేపట్టిన మిషన్ భగీరథ పనులు అసంపూర్తిగా మిగిలాయి. కాంట్రాక్టర్ వైఫల్యం వల్ల పనులు పూర్తి చేయకపోవడంతో గ్రామంలో మంచినీటి సమస్య జఠిలంగా మారింది. ఓ పైపు సత్యసాయి రక్షిత మంచినీటి పథకం ద్వారా సక్రమంగా నీటి సరఫరా జరుగకపోవడం, మరోవైపు మిషన్ భగీరథ పనులు నత్తనడకన సాగుతుండడంతో మంచినీళ్ల కోసం వ్యవసాయ బావుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతేడాది మిషన్ భగీరథ పైప్లైన్ పనులు చేపట్టారు. అయితే గ్రామంలో మిషన్ భగీరథ పైప్లైన్లు వేసి వదిలిపెట్టారు. ఇండ్లకు కనక్షన్లు ఇంత వరకు ఇవ్వక పోవడంతో వేసిన పైప్లైన్లు వృథాగా పడిఉన్నాయి. అలాగే గ్రామంలో మిషన్ భగీరథ పథకం కింద రెండు వాటర్ ట్యాంకులు నిర్మించినా ఇంతవరకు మెయిన్ కనెక్షన్ ఇవ్వలేదు. దీంతో గ్రామంలో తరచూ మంచినీటి సమస్య ఏర్పడుతుందని గ్రామస్తులు తెలిపారు.
నిలిచిన మంచినీటి సరఫరా
గ్రామంలో వారం రోజులుగా మంచినీటి సరఫరా నిలిచిపోయింది. మండలంలోని పారేవుల వద్ద ఉన్న సత్యసాయి రక్షిత తాగునీటి పథకం ద్వారా గ్రామానికి నీటి సరఫరా అయ్యేది. కృష్ణానదిలో సత్యసాయి పైప్లైన్ పగిలిపోయిందని అధికారులు తెలిపారు. గ్రామంలో 10 చేతి పంపులు ఉన్నాయి. ఇందులో కేవలం మూడు బోర్లు మాత్రమే పని చేస్తున్నాయి. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి శాశ్వతంగా మంచినీటి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.
ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నాం
గ్రామంలో నీటి ఎద్దడి ఏర్పడడం వల్ల ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. ఐదు రోజుల నుంచి సత్యసాయి పైప్లైన్ పగిలిపోయి, పంప్హౌస్ వద్ద మోటర్లు కాలిపోయాయి. మరమ్మతుల కారణంగా నీటి సరఫరా నిలిచిపోయింది. మిషన్ భగీరథ పైప్లైన్ వేశారు. కనెక్షన్లు ఇంతవరకు ఇవ్వలేదు. తాత్కాలికంగా పనులు చేస్తే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు బిల్లులు చేయడం లేదు. జీపీ నిధుల ద్వారా పనులు చేయాలన్న నిబంధనల కారణంగా చేపట్టడం లేదు. మంచినీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్తాం.
–ఎండీ అక్రమ్
ఇన్చార్జి సర్పంచ్, కర్ని