హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ఓరుగల్లు సిగలో మరో కలికితురాయి చేరింది. మడికొండ ఐటీపార్క్లో త్రీస్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర సర్కారు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ)కి అనుమతిస్తూ ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. పీపీపీ విధానంలో వీటిని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్ తర్వాత.. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే వరంగల్లో 614 ఎకరాల్లో ఐటీ పార్క్ను విస్తరించనున్నది. ఈ ఏడాది ప్రారంభంలోనే టెక్ మహీంద్రా, సైయంట్ సంస్థలు తమ కార్యాలయాలను మడికొండలో ప్రారంభించాయి. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు హైదరాబాద్ హైటెక్స్ తరహాలో ఇప్పుడు మడికొండలో త్రీస్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్ను తీర్చిదిద్దనున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే హైదరాబాద్ తరువాత ఐటీ పెట్టుబడుల గమ్యస్థానంగా వరంగల్ మారనున్నది.
ఐటీ అడ్డాగా వరంగల్
మడికొండలో 70 వేల చదరపు అడుగుల్లో సైయంట్ను రూ.25 కోట్లతో నిర్మించారు. ఈ కంపెనీ ద్వారా 1000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనున్నది.
టెక్ మహీంద్రా ద్వారా ప్రత్యక్షంగా 1,000 మంది పొందనున్నారు. పరోక్షంగా మరో 1000 మందికి లబ్ధిచేకూరుతుందని అంచనా.
కన్వెన్షన్ సెంటర్ వరంగల్ ప్రజల కల
వరంగల్లో కన్వెన్షన్ సెంటర్ ఉండాలనేది నగర ప్రజల కల. దీన్ని సాకారం చేసేలా నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు వరంగల్పై ఉన్న అభిమానానికి నిదర్శనమిది. వరంగల్ ప్రజలతరఫున వారికి కృతజ్ఞతలు. – పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ