హైదరాబాద్ , మే 31 (నమస్తే తెలంగాణ): దేశంపై కరోనా పంజా విసిరినప్పటికీ పలు రంగాల్లో ప్రగతిని నిరోధించలేకపోయింది. ముఖ్యంగా ఇండ్ల నిర్మాణాలు, రియల్ ప్రాజెక్టులు ఎంతమాత్రం ఆగలేదు. ఇండ్ల నిర్మాణాల అనుమతులకోసం మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. కరోనా తీవ్రంగా ఉన్న ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఆరువేల ఇండ్లకు అనుమతులు లభించాయి. గత నవంబర్ 16 నుంచి అన్నిరకాల ఇండ్లకు టీఎస్బీపాస్ ద్వారా అనుమతులిస్తున్నారు. ఏప్రిల్ 10 నాటికి రాష్ట్రంలో 17,716 అనుమతులు ఇవ్వగా మే 30 నాటికి వాటి సంఖ్య 23,871కు చేరింది. గత 50 రోజుల్లో అన్ని మున్సిపాలిటీలు, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, డీటీసీపీ పరిధిలో 6,155 ఇండ్లకు అనుమతులు పొందారు. రోజుకు సగటున 123 ఇండ్లకు అనుమతులు వస్తున్నాయి. ఇకపై లేఅవుట్లకు కూడా టీఎస్బీపాస్ ద్వారానే అనుమతులు ఇవ్వనున్నారు. ఇందుకోసం టీఎస్బీపాస్లో అవసరమైన మార్పులను తెచ్చారు. ఇప్పటివరకు ఉన్న ఇండ్లకు కొనసాగింపుగా నిర్మించే అదనపు అంతస్తులకు అనుమతులు ఇస్తున్నారు. అక్యుపెన్సీ సర్టిఫికెట్లను కూడా అందిస్తున్నారు. ఇంటి యజమానులకు మరింత అనువుగా ఉండేలా డీపీఎంఎస్లోని పలు ఆప్షన్లు టీఎస్బీపాస్లోనూ తెస్తున్నారు.
ఇన్స్టంట్ అప్రూవల్స్ అత్యధికం..
76 నుంచి 600 గజాల స్థలంలో గృహ నిర్మాణాలకు వేగంగా అనుమతులు లభిస్తున్నాయి. 79 శాతం అనుమతులు ఈ పరిధిలోనే ఉన్నాయి. ఇందులో 18,838 ఇండ్లకు అనుమతులిచ్చామని అధికారులు చెప్తున్నారు. 75 గజాల వరకు ఉన్న స్థలాలకు ఇన్స్ట్టంట్ రిజిస్ట్రేషన్స్ విధానంలో అనుమతులు ఇస్తున్నారు. దీని ద్వారా రాష్ట్రంలోని పట్టణ ప్రాంతల్లో 4,588 ఇండ్లకు అనుమతులు లభించాయి. డీటీసీపీ పరిధిలో అత్యధికంగా 12,524, హెచ్ఎండీఏ పరిధిలో 9,268 అనుమతులు లభించాయి. ఇంటి నిర్మాణానికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పురపాలకశాఖ మంత్రి కే తారక రామరావు నాయకత్వంలో టీఎస్బీపాస్ను తీసుకొవచ్చారు.