హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించే దాదాపు అన్ని సేవలను ఆన్లైన్ చేసిన నేపథ్యంలో భారీగా పోగవుతున్న డాటాను నిల్వ చేసుకొనేందుకు క్లౌడ్ టెక్నాలజీని వినియోగిస్తున్నది. గత ఏడాది అక్టోబర్ 9 నుంచి అన్ని ప్రభుత్వ శాఖలు తమ డాటాను స్టోరేజ్ చేసుకొనేందుకు క్లౌడ్ టెక్నాలజీని వాడుకుంటున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న ఆధునిక యుగంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం దానిని అందిపుచ్చుకొని ఫైల్స్ అన్నింటినీ డిజిటలైజ్ చేసింది. దాదాపు ప్రభుత్వ కార్యాలయాలన్నీ పేపర్లెస్గా దిశగా రూపాంతరం చెందుతున్నాయి. ప్రజలు కూడా చేతిలో స్మార్ట్ఫోన్ ఉంటే చాలు తమకు అవసరమైన సేవలను ఆన్లైన్లోనే పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని నాలుగు కోట్ల జనాభాకు సంబంధించిన వ్యవహారాలు, వారు ప్రభుత్వంతో జరుపుతున్న లావాదేవీలు, భూమి రికార్డులు తదితరమైన వాటికి సంబంధించిన డాటాను నిల్వ చేయడం ప్రభుత్వానికి భారంగా మారింది.
సర్వర్ల స్టోరేజీ పెద్ద సమస్య
ఆయా శాఖల్లో పోగవుతున్న డాటాను నిల్వ చేసేందుకు ప్రభుత్వం తొలుత భారీ సర్వర్లను వినియోగించింది. కానీ సర్వర్లు కొద్దిరోజుల్లోనే నిండిపోవటం, వాటి నిర్వహణ, భద్రతకు అదనపు వ్యయం అవుతుండడంతో కొత్తగా వచ్చిన క్లౌడ్ టెక్నాలజీని రాష్ట్ర ప్రభుత్వం వినియోగంలోకి తీసుకొచ్చింది. క్లౌడ్ టెక్నాలజీని అందిస్తున్న సంస్థల నుంచి మనకు కావాల్సినంత స్పేస్ తీసుకుంటే చాలు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఫైల్స్ నిర్వహణ కోసం క్లౌడ్టెక్నాలజీ వినియోగించాలని నిర్ణయించింది. దీనితో ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న మారుమూల ప్రాంతాలలో సైతం ఎలాంటి అంతరాయం లేకుండా సేవలు అందిస్తున్నారు. భూముల నిర్వహణ, క్రయవిక్రయాల నమోదు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలన్నీ ఆన్లైన్లో అత్యంత సులభంగా అందుతున్నాయి. సచివాలయంలో ఫైళ్ల నిర్వహణ కూడ చకచకా జరుగుతున్నది. ప్రజలు మీ-సేవ కేంద్రాల నుంచి చేసుకున్న దరఖాస్తులు క్షణాల్లో కలెక్టర్తోపాటు సంబంధిత అధికారుల వద్దకు వెళుతున్నాయి. ఆయా అధికారులు వాటిని పరిశీలించి కంప్యూటర్ ద్వారా వెంటనే పరిష్కరిస్తున్నారు.