22 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
ప్రియదర్శిని జూరాలకు తగ్గిన ఇన్ఫ్లో
నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 2 : నాగార్జున సాగర్కు ఎగువ నుంచి ప్రవాహం కొనసాగుతున్నది. సోమవారం సాయంత్రానికి 3.72 లక్షల క్యూసెక్కుల పైచిలుకు ఇన్ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో అధికారులు 22 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు 3.55 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 590 (312.50 టీఎంసీలు) అడుగులకు గాను 587.40 అడుగుల (305.7464 టీఎంసీలు) వద్ద నీరు నిల్వ ఉంచి అదనపు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి 4,37,838 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 4,35,152 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం 885 అడుగులకుగాను ప్రస్తుతం 883.60 అడుగులకు చేరగా.. 215.807 టీఎంసీలకు ప్రస్తుతం 207.8472 టీఎంసీలకు చేరింది. కాగా జూరాలకు ఐదు రోజులుగా 5 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు కాగా సోమవారం సాయంత్రానికి 2.90 లక్షల క్యూసెక్కులకు తగ్గింది.