నల్లగొండ: జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టులోకి 4,986 క్యూసెక్కులు నీరు వస్తుండగా, 2,734 క్యూసెక్కుల నీటికి కింది వదులుతున్నారు. జలాశయం పూర్తి నీటిమట్టం 590 అడుగులు, ప్రస్తుతం 529.80 అడుగులకు చేరుకుంది. సాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 167.7568 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 15,444 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో నిల్గా ఉంది. ఎల్లంపల్లి పూర్తి నీటినిల్వ 20.175 టీఎంసీలు. ప్రస్తుతం 19.0362 టీఎంసీలకు చేరుకుంది.
ఆదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులుకాగా, ప్రస్తుతం 696.17 అడుగుల వద్ద నీరు ఉన్నది. అదేవిధంగా ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 7.603 టీఎంసీలకు గాను ప్రస్తుతం 6.473 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. జలాశయం 4 వరద గేట్ల ద్వారా 23,677 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రజక్టు పూర్తిస్థాయిలో నిండింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి 11,248 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలేస్తున్నారు.