అహ్మదాబాద్: ఒక వ్యక్తి ఒంటిపై మహిళ పంటితో కొరికినట్లు ఉన్న ‘ప్రేమ గాట్ల’ను అతడి భార్య గుర్తించింది. మరో మహిళతో సంబంధం ఉన్నదని ఆమె అనుమానించడంతో కుటుంబ సభ్యులు అతడ్ని చితకబాదారు. దీంతో వారిపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ ఘటన జరిగింది. వాస్నా ప్రాంతంలో నివాసం ఉండే జితు అనే వ్యక్తి మట్టినితవ్వే యంత్రాల కాంట్రాక్టర్గా పని చేస్తున్నాడు.
కాగా, గురువారం రాత్రి జితు ఒంటిపై మహిళ ప్రేమతో కొరికినట్లుగా ఉన్న పంటి గాట్లను భార్య గమనించింది. భర్తకు మరో మహిళతో సంబంధం ఉన్నట్లు ఆమె అనుమానించింది. ఆమె ఈ విషయాన్ని తన సోదరుడికి చెప్పగా జితుపై చేయిచేసుకుని కొట్టాడు. దీంతో ఇంటి నుంచి బయటకెళ్లిన అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అనంతరం జితు ఇంటికి తిరిగి రాగా ఎదురుచూస్తున్న అతడి తల్లితోపాటు సోదరుడు అరవింద్ సైతం కర్రలతో చితకబాదారు. దీంతో మరోసారి పోలీస్ స్టేషన్కు వెళ్లిన జితు, ఈసారి తన తల్లితోపాటు సోదరుడిపై ఫిర్యాదు చేశాడు.