ఆమనగల్లు,జూన్ 4 : దవాఖాన అభివృద్ధికి అందరూ సమష్టిగా కృషి చేద్దామని డీప్యూటీ డీఎంహెచ్వో దీన్దాయల్ కోరారు. శుక్రవారం ఆమనగల్లు ప్రభుత్వ దవాఖాన ఆవరణలో దవాఖాన అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి డిప్యూటీ డీఎంహెచ్వోతో పాటు ఎంపీపీ అనిత, ఎంపీడీవో వెంకట్రాములు, అధికారులు హాజరయ్యారు. సమావేశంలో భాగంగా దవాఖాన స్థాయిపెంపు, వసతి సౌకర్యాలు, వైద్య సిబ్బంది పనితీరు తదితర విషయాలపై చర్చించారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించాలని, సంబంధిత అధికారులు సమావేశానికి హాజరుకావాలని ఎంపీపీ అధికారులకు సూచనలు చేశారు. నిధులు వినియోగంలో అవకతవకలకు పాల్పడకుండా కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం దవాఖానలో పెయింటింగ్, ప్రహరీ నిర్మాణం, తాగునీరు వసతి సౌకర్యాలు, 24 గంటలు వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉండేలా కమిటీ సభ్యులు తీర్మానం చేశారు.
కొవిడ్ విస్తరించకుండా చర్యలు..
పల్లెల్లో ప్రజలు కరోనా బారిన పడకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని డీప్యూటీ డీఎంహెచ్వో కోరారు. పాజిటివ్ కేసులు వచ్చిన గ్రామాలను ఎంపిక చేసి అక్కడే కరోనా పరీక్షలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ దవాఖానలో ఉచితంగా మందులు, వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నిట్టనారాయణ, నాయకులు ఖలీల్, విజయ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.