న్యూఢిల్లీ: వైద్యులపై దాడులకు పాల్పడిన వివిధ సంఘటనలపై ఈ నెల 18న దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహించనున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) చీఫ్ డాక్టర్ జెఏ జయలాల్ శనివారం తెలిపారు. ప్రాణాలు కాపాడే వారిని కాపాడండి.. అన్న నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. వైద్యులు, సిబ్బంది నల్ల రిబ్బన్లు ధరించి నిరసనల్లో పాల్గొంటారని, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారని అన్నారు. అయితే ఆసుపత్రులు యథావిధిగా పనిచేస్తాయని వివరించారు. ఇటీవల డాక్టర్లతోపాటు వైద్య సిబ్బందిపై దాడులు పెరిగిపోయాయని జయలాల్ వాపోయారు. అస్సాం, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఇటీవల కరోనా పోరులో ముందున్న డాక్టర్లపై దాడుల ఘటనలు జరిగాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో విధులు నిర్వహించే వైద్యులు, సిబ్బందికి రక్షణ కల్పించే చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.