అమల్లోకి తెచ్చిన షీటీం విభాగం
స్కానింగ్ పోస్టర్లను ఆవిష్కరించిన సీపీ తరుణ్ జోషి
హన్మకొండ సిటీ, ఏప్రిల్17 : వేధింపులకు గురవుతున్న మహిళలు తాము ఉన్న ప్రాంతం నుంచి సులువుగా షీటీంకు ఫిర్యాదు చేయడానికి క్యూఆర్ కోడ్ స్కాన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి తెలిపారు. ఈ మేరకు షీటీం విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన క్యూఆర్ కోడ్ స్కానింగ్ కంప్లయింట్ వాల్ పోస్టర్స్ను సీపీ శనివారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భం గా సీపీ మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలోని విద్యాసంస్థలు, సినిమా థియేటర్స్, బస్టాండ్, రైల్వేస్టేషన్లలో క్యూఆర్ కోడ్ స్కానింగ్ వాల్ పోస్టర్స్ను ఏర్పాటు చేస్తామన్నారు. బాధితులు తమ ఫోన్లోని క్యూఆర్ కోడ్ స్కాన్ యాప్ ద్వారా షీటీం ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే పోలీస్ వెబ్సైట్కు అనుసంధానం అవుతుందన్నారు. ఆన్లైన్లో వెబ్సైట్ ఫారమ్లో పూర్తి వివరాలు పూరించి, లొకేషన్ సమర్పిస్తే ఫిర్యాదుల స్వీకరణ సెల్కు చేరుతుందన్నారు. వెంటనే షీటీం పోలీసులు రంగంలోకి దిగి కావాల్సిన సహాయాన్ని అందజేస్తాయన్నారు. ఈ ఆవకాశాన్ని బాధిత మహిళలు వినియోగించుకొని భద్రత పొందాలని సూచించారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ ఇన్చార్జి డీసీపీ పుష్ప, వరంగల్ షీటీం ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రావు, మహిళా కానిస్టేబుల్ మమత పాల్గొన్నారు.