జనగామ : జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లో చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం పాలకుర్తిలోని క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సీహెచ్. శివలింగయ్యతో కలిసి డబల్ బెడ్ రూం ఇండ్లు, ఇతర అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రూ. 113 కోట్ల 61 లక్షల అంచనా వ్యయంతో 2 వేల 115 ఇండ్లు మూడు మండలాల్లో మంజూరు చేశామన్నారు. ఇందులో ఒక వేయి 936 ఇండ్లకు టెండర్ ప్రక్రియ పూర్తయి, పనులు ప్రారంభించగా, 397 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. పురోగతిలో ఉన్న నిర్మాణాల్లో పర్యవేక్షణ చేసి, పనులు పూర్తి చేయాలన్నారు.
టెండర్ ప్రక్రియ కాని ఇండ్ల విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. గ్రామం వారీగా ఇండ్ల పురోగతిని సమీక్షించారు. ఇసుక అవసరమైన చోట సంబంధిత తహసీల్దార్ల సహకారం తీసుకోవాలన్నారు. నియోజకవర్గంలోని దాదాపు ప్రతి గ్రామంలో ఇండ్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. చిన్న చిన్న పనులు ఉన్నచోట వెంటనే పూర్తి చేసి, లబ్ధిదారులకు అందజేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు.
లబ్ధిదారులలో అసలైన పేదవారి జాబితా నుంచి ఎంపిక చేయాలన్నారు. జాబితా నోటీస్ బోర్డులో ప్రదర్శించాలని సూచించారు. ఎస్డీఎఫ్, సీడీఎఫ్ నిధుల్లో పురోగతిలో ఉన్న అభివృద్ధి పనుల్లో అదనపు నిధులు అవసరమున్న చోట ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, చెక్ డ్యాం పనుల పూర్తికి చర్యలు చేపట్టాలన్నారు.
కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తే, కాంట్రాక్టు రద్దుచేసి మరొకరికి అప్పగించాలని అన్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని మంత్రి తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటుచేసి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్, డీపీవో రంగాచారి, ఇంజినీరింగ్ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Good news | ప్రవేశ పరీక్ష లేకుండానే ‘ఇగ్నో’లో ఎంబీఏ
మనం మాస్కులు ఇంకా ఎన్ని రోజులు పెట్టుకోవాలి.. ప్రభుత్వం మాట ఇదీ!
రైతులు, కూలీలను ఆప్యాయంగా పలుకరించిన మంత్రి కేటీఆర్