హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరం ఒడిలో మరో నగరం సరికొత్తగా అవతరిస్తున్నది. శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ సకల సౌకర్యాలతో కొత్త నగరం ఆవిర్భవించనున్నది. అదే ఎయిర్పోర్టు సిటీ. శంషాబాద్ విమానాశ్రయం కేంద్రంగా జీఎంఆర్ సంస్థ దీనికి రూపకల్పన చేసింది. విమానాశ్రయం అంటే విమానాల రాకపోకలు మాత్రమే కాదు. అది ఒక ఆధునిక నగరంగా 365 రోజులు 24 గంటలపాటు అన్నిరకాల సేవలు పొందే మినీ నగరంగా ఉండాలన్న లక్ష్యంతో దేశంలోని అతిపెద్ద ఎయిర్పోర్టు సిటీ (ఏరోట్రొపాలిస్)కి శ్రీకారం చుట్టింది. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్) అనుబంధ సంస్థ జీహెచ్ఎంఆర్ హైదరాబాద్ ఏరోట్రొపాలిస్ ఈ నగర నిర్మాణానికి నడుం బిగించింది. విమానాశ్రయానికి ప్రభుత్వం కేటాయించిన 5,495 ఎకరాల్లో 1,500 ఎకరాలను ఎయిర్పోర్టు సిటీకి కేటాయించారు. ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభమై, కొన్ని కంపెనీల కార్యకలాపాలు జరుగుతున్నాయి. దశలవారీగా పూర్తిస్థాయి ఎయిర్పోర్టు సిటీని నిర్మిస్తారు.
మహానగరం నుంచి మెరుగైన కనెక్టివిటీ
హైదరాబాద్ మహానగరం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ఎంతో మెరుగైన కనెక్టివిటీ ఉంది. ముఖ్యంగా గ్రేటర్ చుట్టూ ఉన్న 158 కి.మీ. పొడవున్న ఔటర్ రింగురోడ్డుతో అనుసంధానం ఉంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల నుంచి పీవీ ఎక్స్ప్రెస్ వే, ఐటీ కారిడార్లోని మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి ఓఆర్ఆర్ లింకు రోడ్డు ఉన్నాయి. దీంతో విమానాశ్రయం వేదికగా సరికొత్త నగరాన్ని అందుబాటులోకి తెస్తే అన్నివిధాలుగా లాభదాయకంగా ఉండి, ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుందని గుర్తించి విమానాశ్రయంలో అంతర్భాగంగానే ఎయిర్పోర్టు సిటీని నిర్మిస్తున్నామని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. రవాణా వ్యవస్థ ఆధారిత అభివృద్ధి నమూనా ఇప్పుడు ప్రపంచంలోని చాలా నగరాల్లో అమలు చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ప్రతియేటా 2.5 కోట్ల మంది రాకపోకలు సాగిస్తున్నారు. అలాంటి చోట అన్నిరకాల మౌలిక వసతులు కల్పిస్తే అది మినీ నగరంగా మారేందుకు అవకాశాలు ఉంటాయి. దేశవిదేశాల నుంచి వచ్చినవారు ఎక్కువ దూరం వెళ్లకుండా ఎయిర్పోర్టు సిటీలోని ఐటీ కార్యాలయాలు, హోటల్స్, దవాఖానలు, విద్యాసంస్థలను వినియోగించుకోవచ్చు. ఇక్కడ ఉండే సర్వీస్ అపార్టుమెంట్లలో ఎన్నిరోజులు, నెలలైనా బస చేయవచ్చు.
అన్నీ అద్దె ప్రాతిపదికనే..
ఎయిర్పోర్టు సిటీలో ఐటీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలన్నా, సర్వీసు అపార్టుమెంటులో నివాసం ఉండాలన్నా, రిటైల్ షాపింగ్ వసతులు కావాలన్నా అద్దెకు మాత్రమే ఇస్తారు. ఇక్కడ స్థిరాస్తులు కొనుగోలుకు అవకాశం ఉండదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో శంషాబాద్ విమానాశ్రయాన్ని జీఎంఆర్ సంస్థ నిర్వహిస్తున్నది. ఆ ఒప్పందానికి అనుగుణంగా ఇక్కడి భూముల వినియోగం ఉంటుంది.
ఎయిర్పోర్టు సిటీలో ఉండే సౌకర్యాలు
బిజినెస్ పోర్ట్: ఇందులో ఐటీ, ఐటీఈఎస్ కంపెనీల నిర్వహణకు అవసరమైన కార్యాలయ భవనాలు నిర్మిస్తారు. వీటిని ప్రైవేటు సంస్థలకు అద్దెకిస్తారు. రిటైల్ సంస్థల కార్యకలాపాల కోసం విడిగా భవనాలూ ఉంటాయి. ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తారు.
ఎడ్యుపోర్ట్: జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు అన్ని వయస్సుల వారికి అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తారు. బిజినెస్ స్కూల్, ఇంటర్నేషన్ స్కూల్, ఏవియేషన్ అకాడమీ, ఏరోస్పేస్ ఇంజినీరింగ్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ విద్యాసంస్థలు ఉంటాయి. తరగతి గదిలో శిక్షణతో పాటు ఆయా అంశాల్లో ప్రత్యక్ష అనుభవం కల్పిస్తారు.
ఫన్పోర్టు: ఫన్పోర్టులో థీమ్, అమ్యూజ్మెంట్ పార్క్లతోపాటు వాటర్ పార్క్, గోల్ఫ్ కోర్సు, డెస్టినేషన్ మాల్ వంటివి నిర్మించాలని ప్రతిపాదించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు సేద తీరేందుకు వీలుగా రిసార్టులను నిర్మిస్తున్నారు.
హెల్త్ పోర్టు: దేశవిదేశీ సందర్శకులు మెరుగైన వైద్యసేవలను పొందేలా హెల్త్ పోర్టును ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా గ్లోబల్ టెరిటరీ రిఫరల్ దవాఖానలు, మెడికల్ స్కూలు, నర్సింగ్ స్కూలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, క్లినికల్ రిసెర్చ్, డయాగ్నస్టిక్ సెంటర్, ఆల్టర్నేటివ్ మెడిసిన్ వంటివి ఉంటాయి.
5,495ఎకరాలు- శంషాబాద్ విమానాశ్రయం మొత్తం భూమి
1,500 ఎకరాలు-ఎయిర్పోర్టు సిటీ నిర్మాణం కోసం
1,000 ఎకరాలు థీమ్/పోర్టు ఆధారిత నిర్మాణాల కోసం