మేడ్చల్, మే 4 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దేవరయాంజాల్లోని దేవాదాయ భూములపై ఐఏఎస్ల ప్రత్యేక కమిటీ విచారణ వేగవంతం చేసింది. మంగళవారం కమిటీ సభ్యులు నాలుగు వేర్వేరు బృందాలుగా ఏర్పడి, దేవాదాయ భూముల్లో అక్రమంగా నిర్మించిన గోదాముల వివరాలను సేకరించారు. అందులో 117 నిర్మాణాలు అక్రమ కట్టడాలుగా గుర్తించారు. వాటిని సర్వే చేయాలని సర్వే అధికారులకు ప్రత్యేక విచారణ కమిటీ ఆదేశాలు ఇచ్చింది. మేడ్చల్ జిల్లా యంత్రాంగం దేవాదాయ భూములను సర్వే చేసేందుకు అవసరమయ్యే అధికారులు, సిబ్బందిని ఏర్పాటుచేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారి రఘునందన్రావు నేతృత్వంలో ఐఏఎస్ అధికారులు మేడ్చల్ జిల్లా ఇంచార్జి కలెక్టర్ శ్వేతామొహంతి, నల్లగొండ జిల్లా కలెక్టర్ జీవన్పాటిల్, మంచిర్యాల కలెక్టర్ భారతి హోళికేరి విచారణ చేపట్టారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ దేవాదాయ భూముల్లో అక్రమంగా నిర్మించిన గోదాములపై రైతుల నుంచి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
దేవరయాంజాల్లోని దేవాదాయ భూముల్లో మొత్తం 91 సర్వే నెంబర్లలో 1,525 ఎకరాలు ఉన్నట్టు అధికారులు నిర్ధారించిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఇందులో అక్రమంగా నిర్మించిన 117 గోదాములను గుర్తించారు. మరిన్ని అక్రమ నిర్మాణాలను గుర్తించే పనిలో ఉన్నారు. విచారణ త్వరితగతిన పూర్తిచేసేందుకు ఐఏఎస్ల కమిటీ ఆదేశాల మేరకు మేడ్చల్ జిల్లా యంత్రాంగం 8 మండలస్థాయి బృందాలను ఏర్పాటుచేసింది. ఇందులో తాసిల్దార్, మండల సర్వేయర్, సీనియర్ అసిస్టెంట్, ఇతర సిబ్బంది ఉంటారు. విచారణ కమిటీ సేకరించిన వివరాల ఆధారంగా ఈ బృందాలు సర్వే చేపట్టాయి. సర్వే నంబర్ వివరాలు, యజమాని పేరు, ఎంత స్థలంలో నిర్మాణం చేపట్టారు. నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు ఉన్నాయా అనే వివరాలను సేకరిస్తున్నారు. మల్కాజిగిరిలోని ఆర్డీవో కార్యాలయంలో గోదాముల అనుమతుల ఫైళ్లను అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం.
వెల్దుర్తి, మే 4: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల శివార్లలో మాజీ మంత్రి ఈటల రాజేందర్కు చెందిన జమున హ్యాచరీస్ సంస్థ అసైన్డ్ భూముల కబ్జాపై సర్వేకు వెళ్లిన అధికారులను ఆ సంస్థ ప్రతినిధులు లోపలకు వెళ్లకుండా అడ్డుకొన్నారు. మంగళవారం ఏసీబీ అధికారులు అచ్చంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్వే డీఏ లక్ష్మీసుజాత, వెల్దుర్తి ఎంపీవో తిరుపతిరెడ్డి, అచ్చంపేట, హకీంపేట కార్యదర్శులు జానకీరాం, దేవేందర్ విచారణ చేపట్టారు. అనంతరం జమున హ్యాచరీస్ పరిశ్రమ వద్దకు వెళ్లగా పరిశ్రమ ప్రతినిధులు గేటువేసి లోపలికి వెళ్లకుండా అడ్డుకొన్నారు. దీంతో గేటు బయటే ఆరగంట పాటు వేచిచూశారు. అనంతరం పరిశ్రమ ప్రతినిధి నాయుడు వచ్చి అధికారులతో మాట్లాడారు. బయటి వాహనాలను లోపలికి అనుమతిస్తే కోడి పిల్లలకు వ్యాధిసోకి మరణించే ప్రమాదం ఉన్నందున లోపలికి అనుమతించలేమని చెప్పారు. దాంతో ఏసీబీ అధికారులు పరిశ్రమ లోపలికి వెళ్లకుండానే వెనుతిరిగారు. సర్వే డీఏ, కార్యదర్శి మాత్రమే బైక్పై వెళ్లి నిర్మాణాలను పరిశీలించి వచ్చారు.
దేవరయాంజాల్ దేవాదాయ భూముల్లో అక్రమ నిర్మాణాలపై విచారణ చేస్తున్నాం. 117 గోదాములను మంగళవారం పరిశీలించాం. తదుపరి విచారణలో భాగంగా సర్వే చేసేందుకు ఆదేశాలిచ్చాం. సర్వే పూర్తయితే అన్ని విషయాలు బయటకు వస్తాయి. దేవాదాయ భూములకు సంబంధించిన 91 సర్వే నంబర్లలో నిర్మించిన గోదాములను పరిశీలించాం. మరిన్ని అక్రమ నిర్మాణాలు వెలుగుచూసే అవకాశం ఉంది.
శ్వేతామొహంతి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇంచార్జి కలెక్టర్