నమస్తే తెలంగాణ నెట్వర్క్: కృష్ణా బేసిన్లో వరద స్థిరంగా కొనసాగుతున్నది. ఎగువ నుంచి రెండ్రోజులుగా తగ్గిన ఇన్ఫ్లోలు గురువారం కొద్దిగా పెరిగాయి. నాగార్జునసాగర్కు ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో ప్రాజెక్టు గేట్లను 14 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం 4 గేట్ల ద్వారా మాత్రమే నీటిని విడుదల చేయగా.. గురువారం 14కు పెంచి 2,54,877 క్యూసెక్కులను దిగువకు వదిలారు. తెలంగాణ, ఆంధ్రా పరిధిలోని పులిచింతల ప్రాజెక్టు 16వ నంబర్ గేటు పైకెత్తుతుండగా కొట్టుకుపోయింది. సాగర్ నుంచి వరద ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో అంతేమొత్తంలో దిగువకు విడుదల చేయడానికి ప్రాజెక్టు అధికారులు గురువారం తెల్లవారుజామున గేట్లు ఎత్తే చర్యలు చేపట్టారు. 3.45 గంటల ప్రాంతంలో 16వ నంబర్ గేటును పైకెత్తుతుండగా.. ఒక్కసారిగా ఊడిపోయి కొట్టుకుపోయింది. దీంతో సుమారు 40 వేల క్యూసెక్కుల నీరు అదనంగా దిగువకు వెళ్తున్నది. ఏపీ అధికారులు ఎమర్జెన్సీ గేటును ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టారు. ఏపీ మంత్రులు ప్రాజెక్టును పరిశీలించారు. 24 గంట్లలో మరో గేటును అమర్చి నీటి వృథాను అరికట్టాలని అధికారులను ఆదేశించారు. జూరాల ప్రాజెక్టుకు లక్షన్నర క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. 25 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి మూడ్రోజులుగా 2 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతున్నది. తుంగభద్రడ్యాం 12 గేట్లు ఎత్తి 31,029 క్యూసెక్కులను వదులుతున్నారు. శ్రీశైలం రిజర్వాయర్కు 2,05,261 క్యూసెక్కులు ఇన్ఫ్లో నమోదవుతున్నది.