న్యూఢిల్లీ : యాస్ తుఫాను ముప్పు ముంచుకు వస్తున్నది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. బుధవారం ఉదయం అతి తీవ్ర తుఫాన్గా మారి పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. ప్రస్తుతం ఉత్తర, వాయువ్య దిశగా కదులుతున్న వాయుగుండం సోమవారం తుఫానుగా మారుతుందని, ఆ తర్వాత 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారుతుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 26వ తేదీ నాటికి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్యలో ఉన్న పారాదీప్ దీవుల్లో తీరం దాటుతుందని తెలిపింది.
వాయుగుండం కారణంగా ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవుల్లో వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను నేపథ్యంలో సోమవారానికి మధ్య బంగాళాఖాతంలో గంటకు 65 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తీరం దాటేదాకా గంటకు 90-110 కిలోమీటర్ల వేగంతో, తీరం దాటే సమయంలో 155-165 నుంచి 185 కిలోమీటర్ల వరకు వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. తుఫాను నేపథ్యంలో మధ్య, ఉత్తర బంగాళాఖాతం, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో సముద్రం అల్లకల్లోలంగా, అసాధారణంగా మారుతుందని తెలిపారు. సోమవారం అండమాన్ నికోబార్ దీవుల్లో అలలు మీటర్ నుంచి రెండు మీటర్ల వరకూ ఎగసిపడతాయన్నారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
తుఫాను నేపథ్యంలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించాలని సూచించారు. మరో వైపు నేవీ సైతం నాలుగు యుద్ధ నౌకలను అందుబాటులో ఉంచగా.. సాయుధ బలగాలు సైతం అప్రమత్తంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. యాస్ తుఫానును ఎదుర్కొనేందుకు భారత వైమానిక దళం 11 విమానాలు, 25 హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచింది. ఎన్డీఆర్ఎఫ్ సైతం 334 బృందాలను కోల్కతా, పోర్ట్ బ్లెయిర్కు ఆదివారం పంపింది. ప్రస్తుతం ఉన్న వనరులను పెంచేందుకు ఎనిమిది వరద సహాయ బృందాలను, నాలుగు డైవింగ్ బృందాలను ఒడిశా, బెంగాల్ వద్ద మోహరించినట్లు నావికా దళం తెలిపింది.