ఇల్లెందు, అక్టోబర్ 22: సింగరేణి సంస్థతో పాటు కోలిండియా పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్పరం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నది. దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేసేందుకు ఇటీవల కేంద్రం ప్రత్యేక చట్టాన్ని రూపొందించింది. దీనిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని కోయగూడెం ఓపెన్ కాస్ట్ (కేవోసీ)నూ ప్రైవేటపరం చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. కేవోసీ ఇల్లెందు ఏరియా పరిధిలో ఉన్నది. ఇప్పటికే కేవోసీ-1లో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం పూర్తి కాగా కేవోసీ-2 పరిధిలోని పిట్ -2, పిట్-3లో బొగ్గు ఉత్పత్తి పూర్తయింది. ప్రస్తుతం పిట్-1లో బొగ్గు ఉత్పత్తి జరుగుతున్నది. మరోవైపు కేవోసీ-3 బ్లాకును సింగరేణి ప్రారంభించేందుకు సమాయత్తమైంది. ఇప్పటికే అనేక ప్రభుత్వశాఖల నుంచి అనుమతులు సాధించేందుకు యత్నిస్తున్నది. ఇవాళో రేపో అనుమతులు వస్తాయి అని ఎదురుచూస్తున్న తరుణంలో కేవోసీ బ్లాకును కేంద్రం వేలం వేసేందుకు ప్రయత్నిస్తున్నది. ఇదే కోవలో కొత్తగూడెం సింగరేణి ఏరియాలోని సత్తుపల్లి జేవోసీ (జలగం వెంగళరావు ఓపెన్ కాస్ట్)నూ వేలం వేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
బ్లాక్లు ప్రైవేటు పరమైతే..?
సింగరేణి, కోలిండియా సంస్థలు మల్టీ నేషనల్ కంపెనీలతో కలిసి వేలంలో పాల్గొనాల్సి వస్తుంది. వాటితో పోటీ పడి వేలంలో బ్లాక్లను దక్కించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ బొగ్గు ఉత్పిత్తి అనుమతులను ప్రైవేట్ కంపెనీలు దక్కించుకుంటే యువతకు ఉపాధి అవకాశాలు పెద్దగా ఉండవు. కార్మికులు, ఉద్యోగులు సైతం తమ హక్కులు కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఇప్పటివరకు కార్మికులకు ప్రత్యేక గుర్తింపు, సంఘాలకు హక్కులు ఉన్నాయి. ప్రైవేటుపరం అయితే ఇవన్నీ కోల్పోవాల్సి వస్తుంది. దీని పై యావత్ సింగరేణి, కోలిండియా యాజమాన్యాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకులను వేలం వేసి ప్రైవేట్పరం చేసేందుకు చర్యలను ముమ్మరం చేసింది.
పోరాడాల్సిన అవసరం సమయం..
కేంద్రం బొగ్గు బ్లాక్లను వేలం వేస్తే ప్రైవేట్ కంపెనీలు పోటీపడి కొనే అవకాశం ఉన్నది. ఇప్పటికే కోలిండియా అనేక బ్లాక్లను వేలంలో కొనుగోలు చేసి భారీ నష్టాలు మూట గట్టుకున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులు హక్కులు కోల్పోయి, బొగ్గు ఉత్పిత్తి లక్ష్యాలూ నెరవేరక సంస్థ ఇబ్బందిపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో సింగరేణి సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ విషయంపై జాతీయ కార్మిక సంఘాలు నోరు మెదపడం లేదు. రాజకీయ పార్టీల అనుబంధ సంఘాలైన ఐఎన్టీయూసీ, సీఐటీయూ, ఏఐటీయూసీలతో సహా మిగతా సంఘాలు వేలం విధానాన్ని తిప్పికొట్టడంలో విఫలమయ్యాయి. ప్రత్యేక చట్టం రద్దు చేయాలని నినదించిన దాఖలాలు ఒక్కటి కూడా లేవు. తెలంగాణలో టీబీజీకేఎస్ (తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం) మినహా మిగతా అన్నీ సంఘాలు కేంద్ర జీవోను వ్యతిరేకించడంలో విఫలమవుతున్నాయి.
కేవోసీ పై ఎందుకు.. ?
కేవోసీ-3లో బొగ్గు ఉత్పత్తి అనుమతుల కోసం సింగరేణి కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నది. ఈ మేరకు పలు శాఖలకు దరఖాస్తు చేసుకున్నది. ఇప్పటికే అనుమతులు రావాల్సి ఉన్నది. కేంద్రం ప్రత్యేక జీవో తీసుకురావడంతో ప్రస్తుతం అనుమతులు ప్రశ్నార్థకమయ్యాయి. కేవోసీ-3లో 30 మిలియన్ల టన్నుల బొగ్గు నిక్షిప్తమై ఉందని ఓ అంచనా. ఇక్కడ జీ-13, జీ-14 బొగ్గు విస్తారంగా నిక్షిప్తమై ఉంది. ఈ ఓసీ సుమారు 30 సంవత్సరాల పాటు నిరంతరాయంగా నడిచే అవకాశం ఉన్నది. తద్వారా ఇల్లెందు సింగరేణి ఏరియా మనుగడ కొనసాగుతుంది. వేలంలో ఈ ఓసీని దక్కించుకునేందుకు ప్రైవేటు సంస్థలు పోటీపడే అవకాశం ఉన్నది. సింగరేణితో పోటీపడడానికి బహుళ జాతి కంపెనీలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. గతంలో అనేక బొగ్గు బ్లాకులను బడా బహుళ జాతి కంపెనీలు దక్కించుకున్న విషయం తెలిసిందే. అలాంటి కంపెనీలన్నీ సింగరేణితో పోటీకి వస్తే సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది.
ఆశలు గల్లంతు..
కేవోసీ -3 అనుమతుల వస్తే బొగ్గు రవాణా కోసం సింగరేణి యాజమాన్యం రైల్వే ట్రాక్ ఏర్పాటు చేయాలని రైల్వే శాఖకు ప్రతిపాదనలు పంపింది. టేకులపల్లి మండలంలోని బేతంపూడి నుంచి కేవోసీ వరకు ట్రాక్ నిర్మించేందుకు రైల్వేశాఖ సర్వే సైతం చేపట్టింది. ట్రాక్ నిర్మాణం, భూముల సేకరణ నివేదికను సింగరేణికి వివరించింది. ట్రాక్ నిర్మాణానికి రూ.90 కోట్ల ఖర్చును భరించేందుకు సింగరేణి సిద్ధమైంది. భూసేకరణ, ట్రాక్ నిర్మాణం, విద్యుత్తు లైన్ల పనులను సింగరేణి రైల్వే శాఖకు అప్పగించేందుకు సమాయత్తం అవుతున్న తరుణంలో కేంద్రం సంస్థ ఆశలపై నీళ్లు చల్లింది.
కేంద్ర జీవోను అడ్డుకుంటాం..
దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు బ్లాకులను కేంద్రం ప్రైవేట్పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నది. సింగరేణితో పాటు కోలిండియాలో బొగ్గు బ్లాకులను వేలం వేసేందుకు సిద్ధమైంది. కేంద్రం తీసుకువచ్చి జీవో అమలుకాకుండా అడ్డుకుంటాం. సింగరేణి ప్రైవేటుపరం కాకుండా ఉండేందుకు టీబీజీకేఎస్ శక్తియుక్తులా పోరాడుతున్నది. పోరాటాలకు జాతీయ సంఘాలూ సిద్ధం కావాలి. బొగ్గు బ్లాకుల వేలం జరిగితే సింగరేణి ఆస్తిత్వాన్ని కోల్పోతుంది. కారుణ్య నియామకాలతో పాటు ఉద్యోగులు తమ హక్కులు కోల్పోతారు.