పోలీస్, వైద్య, పంచాయతీ, రెవెన్యూశాఖ అధికారుల విధులు
ఇతర రాష్ర్టాల నుంచి జిల్లాలోకి ప్రవేశిస్తున్న వారిపై నిఘా
24 గంటల్లో మూడు షిప్టులవారీగా 168 మంది సిబ్బంది విధులు
ఆదిలాబాద్, మే 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా కట్టడికి సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. బాధితులను గుర్తించడం, పరీక్షలు నిర్వహించడం, మెరుగైన చికిత్స అందించడం, టీకా వేయడం వంటి వాటితోపాటు లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేస్తున్నది. మహారాష్ట్రలో మహమ్మారి విలయతాండవం చేస్తుండడం, సరిహద్దుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పల్లెలు ఉండడంతో అప్రమత్తమైంది. కొవిడ్ వ్యాప్తికి చెక్ పెట్టేందుకు ఎనిమిది అంతర్రాష్ట్ర చెక్పోస్టులను ఏర్పాటు చేసింది. పోలీస్, వైద్య, పంచాయతీ, మున్సిపల్, రెవెన్యూ శాఖలతోపాటు ఇతర శాఖల ఉద్యోగులు 24 గంటలు విధులు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి జిల్లాల్లోకి వచ్చేవారికి థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. లాక్డౌన్ నిబంధనల ప్రకారం ఈ పాస్లు ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతులు ఇస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సరిహద్దుగా మహారాష్ట్ర ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతోపాటు బోథ్, తలమడుగు, తాంసి, జైనథ్, బేల, గాదిగూడ మండలాలు.. నిర్మల్ జిల్లా భైంసా, బాసర, తానూరు మండలాలు.. మంచిర్యాల జిల్లా చెన్నూర్, కోటపల్లి మండలాలు.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలాలు మహారాష్ట్రకు సరిహద్దుగా ఉంటాయి. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు సరిహద్దు మండలాల ప్రజలు బంధువుల ఇండ్లకు, వ్యాపారులు తమ పనుల కోసం మహారాష్ట్రకు రాకపోకలు సాగిస్తుంటారు. ఆదిలాబాద్ జాతీయ రహదారి-44 మీదుగా ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ర్టాలకు రాకపోకలు సాగుతాయి. సరుకులు, కూరగాయల రవాణా ఉంటుంది. మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అధికంగా ఉండడంతో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి జిల్లాలోకి ప్రవేశిస్తున్న వారికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడంతోపాటు కరోనా లక్షణాలు ఉన్నాయనే వివరాలు తెలుసుకుంటున్నారు.
ఎనిమిది అంతర్రాష్ట్ర చెక్పోస్టులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వం ఎనిమిది అంతర్రాష్ట్ర చెక్పోస్టులను ఏర్పాటు చేసింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి వద్ద.. ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ మండలం ఘన్పూర్, తలమడుగు మండలం లక్ష్మీపూర్, బేల మండలం ఉపసనాల, జైనథ్ మండలం డొల్లార, గాదిగూడ మండలం ఝరి, నిర్మల్ జిల్లాలో తానూరు మండలం బెల్తరోడా, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాపనపల్లి వద్ద్ద అంతర్రాష్ట్ర చెక్పోస్టులను ఏర్పాటు చేసింది. 24 గంటలపాటు మూడు షిఫ్టుల్లో ఉద్యోగులు ఇక్కడ విధులు నిర్వహిస్తారు. నలుగురు పోలీస్ సిబ్బంది, ఒకరు రెవెన్యూ, ఇద్దరు వైద్యశాఖ ఉద్యోగులు ప్రతి చెక్పోస్టులో ఉంటారు. ప్రతి షిప్టులో ఏడుగురు చొప్పున 21 మంది పనిచేస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎనిమిది చెక్పోస్టులు ఉండగా.. 24 గంటల్లో 168 మంది ఉద్యోగులు కరోనా నివారణలో భాగంగా సేవలు అందిస్తున్నారు.
పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టుల్లో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో ఉదయం 6-10 గంటల వరకు మాత్రమే వాహనాలను అనుమతిస్తారు. మహారాష్ట్ర నుంచి వచ్చే పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏటూ వెళ్తున్నారు? ఈ పాస్ తీసుకున్నారనే వివరాలు ఫోన్ నంబర్లు రాసుకుంటారు. రెవెన్యూ సిబ్బంది వాహనం ఎక్కడి నుంచి వస్తుంది? ఎటూ వెళ్తున్నారు? అనే వివరాలు తెలుసుకుంటారు. కరోనా కేసులు ఉంటే నోట్ చేసుకుని ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తారు. రాష్ట్రంలోకి ప్రవేశించే వారికి వైద్య సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారు. కరోనా లక్షణాలు ఉంటే రాష్ట్రంలో అడ్డుకుని వారి సొంత ప్రాంతాలకు పంపిస్తారు. మన రాష్ర్టానికి చెందిన వారు ఉంటే వారి వివరాలు తెలుసుకొని ఆయా జిల్లా వైద్యాధికారులకు సమాచారం ఇస్తారు.
కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నాం..
తానూర్, మే 19 : ప్రభుత్వం కరోనా కట్టడికి ఎనిమిది రోజులుగా చేపట్టిన లాక్డౌన్కు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు. తానూర్ మండలంలోని బెల్తరోడా చెక్పోస్టు వద్ద మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నాం. జ్వరంతో బాధపడుతున్న వారికి మందులు ఇచ్చి తిరిగి మహారాష్ట్రకు పంపుతున్నాం. ప్రతి ఒక్కరికీ కొవిడ్ నిబంధనలు పాటించేలా సలహాలు ఇస్తున్నాం.
వైద్యుల సూచనల మేరకు రెఫర్
కోటపల్లి, మే 19 : చెక్పోస్టు వద్ద మా వైద్యశాఖకు కూడా విధులు కేటాయించారు. మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ రాష్ర్టాల నుంచి వచ్చే ప్రయాణికులను పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఉన్నాతాధికారుల సూచనల మేరకు రెఫర్ చేస్తున్నాం. అత్యవసర కేసులు వివరాలు నమోదు చేసుకోవడంతోపాటు వెంటనే సమాచారాన్ని మా శాఖకు చేరవేస్తున్నాం. పొరుగు రాష్ర్టాల నుంచి వచ్చే కొవిడ్ పేషెంట్లు ముందుగానే ఫోన్ ద్వారా దవాఖానలను సంప్రదించి వెళ్తే ఇబ్బంది ఉండదని సూచిస్తున్నాం.