సరైన నీటివనరులు లేక సతమతం అవుతున్న రైతులు భుజంభుజం కలిపి ముందుకు సాగారు. నిరుపయోగంగా ఉన్న మంచినీటి సరఫరా వ్యవస్థలను ఇతరేతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చన్న ప్రభుత్వ ఉత్తర్వులను ఆసరాగా చేసుకుని లిఫ్టు ఏర్పాటు చేసుకున్నారు. నీటిని ఎత్తిపోస్తున్నారు. 800 ఎకరాల్లో రెండు పంటలను సాగు చేసుకున్నారు. చేయిచేయి కలిపి కలిసికట్టుగా కదిలి.. కరువును జయించిన కట్టంగూర్ మండలం చెర్వుఅన్నారం రైతుల విజయగాథ ఇది..
నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): కట్టంగూర్ మండలం చెర్వు అన్నారం గ్రామం పూర్తిగా వ్యవసాయ ఆధారితం. ఎక్కువగా నిమ్మతోటలు, కొద్ది మొత్తంలో వరి సాగయ్యేవి. శాశ్వత నీటివనరులు లేవు. కరువు పరిస్థితుల్లో భూగర్భజలాలు అడుగంటి బోర్లు బోసిపోతే తోటలు, పంటలు ఎండిపోయేవి. రైతులు కొత్త బోర్లు వేస్తూ ఆర్థికంగా మరిం త చితికిపోయేవారు. గ్రామానికి చెందిన మాజీ ఎమ్మె ల్యే నంద్యాల నర్సింహారెడ్డితోపాటు రైతులంతా కలిసి.. గ్రామానికి దగ్గరలో ఉన్న అయిటిపాముల చెర్వు నుంచి సాగునీటిని ఎత్తిపోస్తే కరువు తీరుతుందనే నిర్ణయానికి వచ్చారు. అయిటిపాముల రిజర్వాయర్ నుంచి ఇతర గ్రామాలకు తాగునీటి కోసం కృష్ణాజలాలను అందించే పథకం అప్పటికే అమల్లో ఉంది. స్వరాష్ట్రంలో మిషన్ భగీరథతో ఆ అవసరం లేకుండా పోయింది. దీంతో రిజర్వాయర్లోని పంపుహౌస్, దాని విద్యుత్తు వ్యవస్థ, పంప్హౌస్ నుంచి ట్రీట్మెం ట్ ప్లాంట్ వరకు ఉన్న పైప్లైన్, ట్రీట్మెంట్ ప్లాంట్లోని గదులు, స్థలం నిరుపయోగంగా మారాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా నిరుపయోగంగా ఉన్న మంచినీటి పథకాలను ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చని అప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దానిని ఆధారంగా చేసుకుని 2019 డిసెంబర్లో గ్రామ పరిధిలోని పోచమ్మకుంట, మర్లకుంట చుట్టుపక్కల ఉండే 120 మంది రైతులు చెర్వుఅన్నారం ఫార్మర్ వెల్ఫేర్ సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు.
మంత్రి జగదీశ్రెడ్డి సంపూర్ణ సహకారం
ప్రభుత్వ ఉత్తర్వులతో స్ఫూర్తిపొందిన సొసైటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డితో కలిసి స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సహకారంతో జిల్లా మంత్రి జీ జగదీశ్రెడ్డిని కలిశారు. అయిటిపాముల మంచినీటి పథకం వసతులను లిఫ్టు ఏర్పాటుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన మంత్రి.. విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళారు. సంబంధిత ఉన్నతస్థాయి అధికారులతోనూ మాట్లాడి, రైతుల పక్షాన నిలిచారు. నిరుపయోగంగా ఉన్న అయిటిపాముల మంచినీటి పథకాన్ని వినియోగించుకునేలా ఉత్తర్వులు జారీ చేయించారు. దీని పరిధిలోని పంప్హౌస్, పైప్లైన్, ట్రీట్మెంట్ ప్లాంట్ స్థలం ఇలా అన్నిటినీ రైతులకు అప్పగించారు. గతంలో మంచినీటి పథకం కింద ఉన్న కరెంటు కనెక్షన్ను లిఫ్టు స్కీంకు మార్పు చేస్తూ మంత్రి ఉత్తర్వులు జారీ చేయించడంతో ఉచిత కరెంటు కూడా అందుబాటులోకి వచ్చింది.
ఎకరానికి 14 వేల చొప్పున నిధి సమీకరణ
ప్రభుత్వం అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వడంతో రైతులంతా లిఫ్టు ఏర్పాటుపై దృష్టి సారించారు. రైతులంతా కలిసి ఒక్కో ఎకరానికి 10 వేల చొప్పున స్వచ్ఛందంగా విరాళాలు వేసుకుని, లిఫ్టు స్కీం నిర్మించుకున్నారు. ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి పోచమ్మకుంట, మర్లకుంట్ల వరకు సుమారు 4.7 కిలోమీటర్ల మేర ప్రత్యేకంగా హెచ్డీపీ పైప్లైను వేశారు. ఇందుకోసం 62 లక్షలు వెచ్చించారు. అప్పటికే ఉన్న మోటర్ను రిపేర్ చేయించారు. అంతా సిద్ధంచేసుకుని గతేడాది మార్చి నాటికే పాత మోటర్తో ట్రయల్న్ జరిపారు. అది సక్సెస్ కావడంతో రెండు కుంటల్లోకి నీటిని లిఫ్టు చేశారు. దీంతో గత వేసవి నుంచే ఇక్కడ కరువు పరిస్థితులకు చెక్ పెట్టగలిగారు. పాత మోటర్కు రిపేర్లు వస్తుండటంతో కొత్తది కొన్నారు. ఇందుకోసం మరో దఫాగా ఎకరానికి నాలుగు వేల చొప్పున విరాళాలు సేకరించారు. మొత్తంగా 98 లక్షల నిధులను సమకూర్చుకున్నారు. లోవోల్టేజీని అధిగమించేలా.. ఆటోమెటిక్ ఆన్-ఆఫ్ సిస్టమ్తో కూడిన డెన్మార్క్ డెస్మీ కంపెనీ మోటర్ను నేరుగా కంపెనీ ప్రతినిధులను సంప్రదించి తక్కువ ధరకే కొనుగోలు చేశారు. ట్రయల్న్ సక్సెస్ కావడంతో శుక్రవారం రైతులే కొబ్బరికాయ కొట్టి కొత్త మోటర్తో లిఫ్టును ప్రారంభించుకున్నారు. ఈ లిఫ్టు ద్వారా శుక్రవారం పోచమ్మకుంటలోకి ప్రవహిస్తున్న నీటిని చూసిన రైతుల కళ్లల్లో ఆనందం తొణికిసలాడింది.
సస్యశ్యామలంగా భూములు
ఈ లిఫ్టుతో గ్రామ పరిధిలోని 2 కుంటల చుట్టుపక్కల ఉన్న సుమారు 800 ఎకరాలకు భూగర్భజలాలు అందుబాటులోకి వచ్చాయి. బోర్లలో నీరు ఉండటంతో ఈ వానకాలం కుంటల చుట్టూ ఉన్న భూముల్లో వరి విస్తృతంగా సాగైంది. నిమ్మతోటలకు ఢోకా లేకుండా పోయింది. కూరగాయలు, ఇతర ఉద్యాన పంటల సాగు కూడా పెరిగింది. రైతుల సమిష్టికృషికి ప్రభుత్వ సహకారం తోడవడంతో దశాబ్దాల కరువు పరిస్థితులపై విజ యం సాధించిన చెర్వుఅన్నారం సొసైటీ రైతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కృషితో ఇదే అయిటిపాముల రిజర్వాయర్ నుంచి మరో 10 వేల ఎకరాలకుపైగా సాగునీరందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే రూ.110 కోట్లు మంజూరు చేసింది. ఇది కూడా పూర్తయ్యి అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలం అవుతుంది.
సమిష్టి కృషికి సర్కారు తోడు
నీళ్లులేక నిమ్మ తోటలు ఎండిపోయేవి. ఎట్లా అని ఆలోచిస్తుంటే అయిటిపాముల చెర్వు నుంచి నీళ్లు తెస్తే బాగుంటుందనుకున్నం. రైతులమంతా సొసైటీ పెట్టుకున్నం. మా ఎమ్మెల్యే లింగయ్య, మా ఊరికి చెందిన మాజీ ఎమ్మెల్యే నర్సింహారెడ్డి సార్లు తోడయ్యారు. అందరం కలిసి మంత్రి జగదీశ్రెడ్డి సార్ దగ్గరికి పోయి గోస చెప్పుకున్నం. వెంటనే మంత్రి సీఎం సార్తో మాట్లాడి మాకు లిఫ్టు మంజూరీ చేపిచ్చిండు. తర్వాత రైతులందరం తలా కొంత వేసుకుని మోటర్ నడిపించినం. ఇవ్వాళ కొత్త మోటార్ను కూడా స్టార్ట్ చేసినం. ప్రభుత్వానికి, మంత్రికి, ఎమ్మెల్యేకు, అందరికీ మా ఊరి రైతుల తరుపున దండం పెడుతున్నం.
– అనంతరెడ్డి, సొసైటీ చైర్మన్
లిఫ్టు నీళ్లతో పానం లేసొచ్చింది
మాకు మూడెకరాల భూమి ఉంది. రెండు ఎకరాలు నిమ్మ, ఒక్క ఎకరం వరి. నిమ్మతోటకు బోర్లలో నీళ్లు ఉండేవి కావు. తోటను నిలబెట్టుకునేటందుకు 21 బోర్లు ఏసిన. అయినా నీళ్లు రాలే. నీళ్లేమో కానీ.. నా పేరు బోర్ల ఎల్లమ్మ అయ్యింది. ఇప్పుడు మా కుంటలకు పొయినేడు నుంచి నీళ్లొస్తున్నయ్. రెండెకరాల నిమ్మ తోట.. ఎకరం వరిచేను పెట్టిన. పచ్చగ ముద్దుగున్నయ్. లిఫ్టు నీళ్లతో పోయిన పానం లేసొచ్చినట్టయింది. చానా సంతోషం.
– చిర్రబోయిన ఎల్లమ్మ, గ్రామస్థురాలు