కరీంనగర్, మే 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీలింగ్ యాక్టును ఉల్లంఘించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ను అరెస్టు చేయాలని కాంగ్రెస్ నేత కౌశిక్రెడ్డి డిమాండ్ చేశారు. ఈటల అక్రమాలు, కబ్జాలు, అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. మంగళవారం కరీంనగర్లో కౌశిక్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీలింగ్ చట్టం ప్రకారం ఒక కుటుంబానికి 50 ఎకరాల భూమి ఉండాలని కానీ, ఇప్పటివరకు దొరికిన డాక్యుమెంట్ల ప్రకారం ఈటల కుటుంబానికి అధికారికంగా 130.32 ఎకరాల స్థలం ఉన్నదని తెలిపారు. వీటికి సంబంధించిన ఆధారాలను చూపించారు. సీలింగ్ యాక్టుకు మించిఉన్న దాదాపు 80 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు తాను బయటపెట్టిన భూముల విలువే రూ.600 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈటలకు సూరి, సుధాకర్రెడ్డి, సాద కేశవరెడ్డి బినామీలుగా ఉన్నారని, ఆయన పేరుపై 700 ఎకరాల భూమి ఉన్నదని తెలిపారు. త్వరలోనే మరిన్ని వివరాలు బయట పెడుతామని పేర్కొన్నారు. సమావేశంలో కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణరావు, జిల్లా అధికార ప్రతినిధి సొల్లుబాబు, నాయకులు దిలీప్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.