హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): నిన్న మొన్నటిదాకా బీజేపీని నిందించి.. ఇప్పుడు ఆ పార్టీతోనే అంటకాగిన ఈటల రాజేందర్ ప్రజలకు ఏం జవాబు చెప్తారని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణకు అడగడుగునా ద్రోహంచేస్తున్న బీజేపీలో చేరి న ఈటల కనీసం హూజూరాబాద్ ప్రజలకైనా సమాధా నం చెప్పాలని డిమాండ్చేశారు. సోమవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, ఎన్ భాస్కర్రావు, బొల్లం మల్లయ్యయాదవ్, పైళ్ల శేఖర్రెడ్డితో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈటలకు టీఆర్ఎస్ అన్ని అవకాశాలు ఇచ్చిందని.. కానీ, ఏదో నష్టం, అన్యాయం జరుగుతున్నదనే అపోహపడి పార్టీని వీడారని విమర్శించారు. బీజేపీలో చేరేందుకు ముందుగా సిద్ధపడే టీఆర్ఎస్పై, ప్రభుత్వంపై ఆరోపణలు చేసినట్టు పరిణామాలు స్పష్టంచేస్తున్నాయన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని నిన్నటిదాకా విమర్శించిన ఈటల.. ఇప్పుడు వాటిల్లో ఏమార్పు వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ మునిగిపోయే నావ అని, అందులోపడి ఈటల మునిగిపోవడం ఖాయమని ఎద్దేవాచేశారు. దేశంలో 85 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికోసం గత ఏడేండ్లలో బీజేపీ ఒక్కపథకమైనా తీసుకొచ్చిందా? అని నిలదీశారు. స్వార్థంకోసం, ప్రత్యేక ఎజెండాలో భాగంగానే ఆపార్టీలో చేరిన ఈటలకు.. టీఆర్ఎస్ను కానీ, సీఎం కేసీఆర్ను కానీ విమర్శించే నైతిక హక్కులేదని చెప్పారు. కేసీఆర్పై విమర్శలు చేయడం ద్వారా పెద్దనాయకుడైపోతానని అనుకోవడం తెలివి తక్కువతనమేనని మండిపడ్డారు.
కాంగ్రెస్కు భూముల వేలంపై మాట్లాడే హక్కులేదు
రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వం భూము ల వేలం నిర్వహిస్తుంటే కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉన్నదని జగదీశ్రెడ్డి అన్నారు. ప్రభుత్వం భూముల వేలం ప్రారంభించిందే నాటి కాంగ్రెస్ ప్రభుత్వమని.. ఇప్పుడు విమర్శలు చేసే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కోర్టుల్లో కేసులు వేసిన, మిషన్భగీరథ వంటి గొప్ప పథకాన్ని అమలుకాకుండా అడ్డుకున్న కాంగ్రెస్ను అభివృద్ధి నిరోధక పార్టీగా రాష్ట్ర ప్రజలు ఏనాడో తేల్చిచెప్పారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడితే అలజడి ఉంటుందని, రాష్ట్రం అంతా చిమ్మచీకట్లోకి వెళుతుందని చెప్పిన ఆ పార్టీ నాయకులు ఎప్పుడో శాశ్వతంగా చీకట్లోకి వెళ్లిపోయారని ఎద్దేవాచేశారు.
టీఆర్ఎస్ వెంటే ప్రజలు
టీఆర్ఎస్ పార్టీని వీడటం ఈటలకే నష్టమని జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు నూటికి నూరుశాతం సీఎం కేసీఆర్ వెంట, టీఆర్ఎస్ పార్టీవెంటే ఉన్నారని తెలిపారు. ఈటలను మంత్రి పదవి నుంచి తొలగిస్తే ముందుగా ఏదో అనుకొన్నారని.. కానీ బీజేపీలో చేరడం ద్వారా ఈటలకు సొంత ఎజెండా ఉన్నదని అంతా గ్రహిస్తున్నారని చెప్పారు. తమను మోసంచేసినట్టు హుజూరాబాద్ ప్రజలు కూడా నిర్ధారణకు వచ్చారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి, సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో అద్భుతంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. 30-40 లక్షల టన్నుల ధాన్యం పండితే గొప్పగా చెప్పుకొనే స్థితి నుంచి నేడు తెలంగాణను మూడు కోట్ల టన్నులకు చేర్చి దేశానికే అన్నపూర్ణగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్దని చెప్పారు.