కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ): హక్కుల కోసం ఉద్యమించిన అమాయక ఆదివాసీలపై నాడు అధికారంలో ఉండి కాల్పులు జరిపిన కాంగ్రెస్.. నేడు అదే ఇంద్రవెల్లి వేదికగా ఎన్నికల పబ్బం గడుపుకొనేందుకు నాటకాలు ఆడుతున్నదని పలువురు ఆదివాసీ మేధావులు మండిపడుతున్నారు. 1981 ఏప్రిల్ 20న.. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అడవిబిడ్డలపై కాల్పులు జరిపింది. ఆ ఘటనలో 13 మంది చనిపోయినట్టు లెక్కలు చూపి నా.. అనధికారికంగా 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. నాడు ఆదివాసీల ప్రాణత్యాగాలకు సాక్ష్యం గా నిలిచిన ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్దే.. ప్రపంచ ఆదివాసీ దినోత్సవమైన ఈ నెల 9న కాంగ్రెస్ దళిత-గిరిజన దండోరా పేరిట సభ నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అడవిపై హక్కు తమదని అడిగిన ఆదివాసీలను పిట్టలను కాల్చినట్టు కాల్చిచంపి.. నేడు అదే అమరవీరుల సమాధుల మీద సభను నిర్వహించాలని చూడటం సిగ్గు చేటని ఆదివాసీ పెద్దలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నాడు ఆదివాసీలు చిందించిన నెత్తుటి మరకలను కాంగ్రెస్ తుడవగలదా?.. వారి ప్రాణాలకు విలువ కట్టగలదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. 40 ఏళ్లు అధికారంలో ఉండి ఏనాడూ ఆదివాసీల అభివృద్ధిని పట్టించుకోలేదని, ఇప్పుడు దండోరా పేరిట వారిపై జాలిచూపడం విడ్డూరమని, అమరవీరుల త్యాగాలను అపవిత్రం చేసే ఎత్తుగడలు వేస్తున్నదని ఆరోపిస్తున్నారు.
స్వరాష్ట్రంలో స్వేచ్ఛగా..
ఇంద్రవెల్లి ఘటనకు కారణమైన కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలో ఉన్నప్పుడు స్తూపం వద్ద నివాళులర్పించే అవకాశాన్ని ఇవ్వలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015 ఏప్రిల్ 20న తొలిసారిగా ఆదివాసీలు అమరవీరుల స్తూపం వద్ద స్వేచ్ఛగా నివాళులర్పించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వమే అవకాశం కల్పించింది.
సోషల్ మీడియాలో వైరల్..
‘ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ గిరిజన దండోరా పెట్టడం అంటే చంపినోడే శవానికి దండేసినట్టు.. 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో పెద్ద సంఖ్యలో గిరిజనులను పిట్టల్లా కాల్చిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు అక్కడే గిరిజనోద్ధరణనా?’ అనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.