హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/మేడ్చల్, జూలై 12 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి నియామకంతో ఏదో ఊడిపడుతుందనుకున్న హస్తం అధిష్ఠానానికి షాక్ మీద షాక్ తగులుతున్నది. ఆయన మల్కాజిగిరి నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖాళీ అవుతున్నది. తాజాగా జవహర్నగర్, తూంకుంట మున్సిపాలిటీల పరిధిలోని పార్టీ ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్లో చేరడంతో మిగిలిన కొద్దోగొప్పో క్యాడర్ కూడా అదే బాటలో పయనించేందుకు సిద్ధమవుతున్నది. ఘట్కేసర్ మున్సిపాలిటీకి చెందిన పలువురు టీఆర్ఎస్లో చేరారు. జవహర్నగర్ కార్పొరేషన్లో 28 స్థానాలకు నాలుగు స్థానాలే కాంగ్రెస్కు దక్కాయి. ప్రస్తుతం ఈ నలుగురు కార్పొరేటర్లు కూడా టీఆర్ఎస్లో చేరడంతో ఆ కార్పొరేషన్ కాంగ్రెస్ ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. తూంకుంట మున్సిపాలిటీలోనూ రెండు వార్డులు కాంగ్రెస్కు దక్కగా.. రేపోమాపో ఆ ఇద్దరు కౌ న్సిలర్లు రాజ్పుత్ పూజ భరత్సింగ్, సింగిరెడ్డి మాధుసూదన్రెడ్డి టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని మేడ్చల్ జిల్లాలో కీలకనేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఇదివరకే పార్టీని విడిచిపెట్టారు. త్వరలో మరింత మంది కీలక కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం.