కోల్కతా : బెంగాల్లో విస్తారా ఎయిర్ లైన్స్కు చెందిన విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్కు 15 నిమిషాల ముందు ఒక్కసారిగా కుదుపులకు గురవడంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరికి స్వల్ప గాయాలవగా.. దవాఖానాలకు తరలించారు. సోమవారం బోయింగ్ 737 విమానం ముంబై నుంచి కోల్కతాకు వెళ్తుండగా.. ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ సమయంలో విమానంలో 113 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే, చివరకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. గాయపడిన ప్రయాణికులను విమానాశ్రయంలో ప్రథమ చికిత్సలు అందించి తర్వాత ఆసుపత్రికి తరలించినట్లు ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ వర్గాలు తెలిపాయి. ముగ్గురిలో ఒకరు డిశ్చార్జి అవగా.. ఇద్దరు కోల్కతాలోని రెండు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పాయి. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, తదుపరి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నాయి.