జగిత్యాల, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : ‘పనిచేయడం నామోషీ కాదు.. పనంటే ఇష్టం ఉండాలి. అది చిన్నప్పటి నుంచే అలవాటు కావాలి’ ఈ మాటలకు నిలువెత్తు నిదర్శనమే జగిత్యాల పట్టణానికి చెందిన బండివార్ శ్రీప్రకాష్. చదువుతున్నది ఆరో తరగతే. కానీ, కష్టపడాలన్న అమ్మ మాటలే అతనికి స్ఫూర్తి. చదువుకుంటూనే పేపర్ బాయ్గా పనిచేస్తున్నాడు. ‘చిన్నప్పుడే పని ఎందుకు చేస్తున్నావు’ అన్న ఓ ప్రశ్నకు.. ‘చదువుకుంటున్నా. పనిచేస్తున్నా. తప్పేంటి?’ అని టక్కున చెప్పేశాడు. ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. బుడ్డోడి సమాధానానికి ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కూడా ఫిదా అయ్యారు. జగిత్యాల పట్టణానికి చెందిన బండివార్ ప్రతాప్వీర్గౌడ్, అనూష దంపతులకు సాయిక్రిష్ణ, శ్రీప్రకాశ్ ఇద్దరు కొడుకులు. తండ్రి క్యాబ్ను నిర్వహిస్తుండగా, అనూష బోటిక్ వ్యాపారం చేస్తున్నారు.
ఇద్దరు పిల్లలను తొలుత ప్రైవేటు పాఠశాలల్లో చదివించిన అనూష.. సర్కారు బడుల్లోనూ మంచి విద్యాబోధన లభిస్తున్నదన్న అభిప్రాయంతో సాయిక్రిష్ణ, శ్రీప్రకాష్ను రెండేండ్ల కిందట జగిత్యాల పురాతన ఉన్నత పాఠశాలలో చేర్పించారు. పిల్లలిద్దరూ తెల్లవారుజామున 5.30 గంటల నుంచి 7 గంటల వరకు చెరో సైకిల్పై పట్టణంలోని పలుకాలనీల్లో తలా నూట ఇరవై ఇండ్లలో దినపత్రికలు వేస్తున్నారు. ‘న్యూస్ పేపర్ వేయడం తప్పు కాదుగా.. చదువుకుంటున్నాను. పేపర్ వేస్తున్నాను. ఇలా చేయడం వల్ల పని గొప్పతనం తెలుస్తుంది’ అని ఆరోతరగతి చదువుతున్న శ్రీప్రకాష్ చెప్తున్నాడు. పదేండ్ల ప్రాయంలోనే పనిచేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందన్న ప్రశ్నకు.. ‘మూడేండ్ల కిందటి వరకు తెల్లవారేదాకా లేవకపోయేది. ఇది మా అమ్మకు నచ్చేది కాదు. పొద్దున్నే లేవాలని, యాక్టివ్గా ఉండాలని, రన్నింగ్ చేయాలని, తోచిన పనిచేయాలని, వ్యాయాయం చేయాలని ఎప్పుడూ చెప్పేది. మొదట్ల అమ్మ మాటలను పెద్దగా లెక్కపెట్టలేదు. అన్నయ్యకు సైకిల్ కొనిచ్చి రోజూ పొద్దున్నే లేచి, సైక్లింగ్ చేయాలని చెప్పింది.
అన్నయ్య పొద్దున్నే లేచి సైకిల్పై తిరగడం మొదలుపెట్టిండు. అన్నయ్యతోపాటు నేను కూడా సైకిల్పై వెళ్లేవాన్ని. చిన్నప్పటి నుంచే కష్టపడటం అలవాటు చేసుకోవాలని అమ్మ మాకు చెప్పడం మొదలుపెట్టింది. పనిచేయడం తప్పుకాదని, దొంగతనం తప్ప, ఏ పనిచేసినా మంచిదేనని చెప్పేది. రోజూ సైకిల్పై తిరుగుతూనే.. న్యూస్పేపర్ వేస్తే అవగాహన వస్తుందని, పని గొప్పతనం తెలుస్తుందని చెప్పింది. అన్నయ్య ఆరో తరగతిలో ఉన్నప్పటి నుంచే న్యూస్పేపర్ వేయడం మొదలుపెట్టాడు. ఏడాది కిందట నాకు కూడా సైకిల్ కొనిచ్చారు. సైక్లింగ్తోపాటు అన్నయ్య లెక్కనే పేపర్ వేస్తే మంచిగుంటుందని నాకే అనిపించింది. ఇదే మాట అమ్మనాన్నకు చెప్పా. వాళ్లు సరేనన్నారు. ఏడాది నుంచి నేను పేపర్ వేస్తున్నా. రోజూ 110 ఇండ్లలో పేపర్ వేస్తాను. నెలకు రూ.1100 ఇస్తారు. డబ్బులు ఎన్ని వచ్చాయన్నది కాదు ముఖ్యం కష్టపడి సంపాదించామా? లేదా? అన్నదే ముఖ్యమని అమ్మ చెప్పింది. అయినా పొద్దున్నే రోడ్లపై ఎవరూ లేని సమయంలో వేగంగా ఇంటింటికీ వెళ్తూ పేపర్ వేయడంలో మస్తు మజా ఉన్నది’ అని శ్రీప్రకాశ్ చెప్తున్నాడు.
సోషల్మీడియాలో వైరల్ అవుతున్న జగిత్యాల పేపర్ బాయ్ వీడియో చూసి ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. ‘జగిత్యాల టౌన్ నుంచి వచ్చిన ఈ వీడియో నచ్చింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థి శ్రీప్రకాష్ విశ్వాసం, ప్రశాంతత, ఆలోచన, వ్యక్తీకరణలో స్పష్టత నచ్చింది. చదువుకుంటూ పనిచేయడంలో తప్పేంటని అతను చెప్పిన తీరు భవిష్యత్తులో అతడిని మంచి స్థితిలో ఉంచుతుంది’ అని గురువారం ట్వీట్ చేశారు.