కరీంనగర్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్: కరీంనగర్ జిల్లాలో వ్యాక్సిన్ కొరతపై ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. డిమాండ్కు తగ్గ సప్లయ్ లేదని అధికారులు చెబుతుండగా, టీకాలు వేసుకునేందుకు వచ్చిన జనం అసహనం వ్యక్తంచేస్తున్నారు. గురువారం కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానలోని వ్యాక్సినేషన్ సెంటర్కు 535 మందికిపైగా వచ్చారు. మధ్యాహ్నం వరకు 250 మందికి మాత్రమే టీకాలు వేశారు. టీకాలు అయిపోయిన విషయం తెలుపడంతో వైద్య సిబ్బందిని నిలదీశారు. దవాఖాన అధికారులు వాయిల్స్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో తీవ్ర నిరాశతో జనం ఇంటి దారిపట్టారు. కరీంనగర్ జిల్లాలో 72 సెంటర్లు ఏర్పాటు చేయగా.. ఈ నెల 23న ఒక్కరోజే 15,456 మందికి టీకాలు వేశారు. వ్యాక్సిన్ సప్లయ్ తగ్గిన కొద్దీ సెంటర్లను తగ్గిస్తూ వచ్చారు. గురువారం కేవలం 6 సెంటర్లలో 1,200 మందికి మాత్రమే ఇచ్చారు. డిమాండ్కు తగ్గట్టు సప్లయ్ లేకపోవడమే దీనికి కారణమని అధికారులుపేర్కొంటున్నారు.