హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): యాసంగిలో వరిపంటకు ప్రత్యామ్నాయంపై వ్యవసాయశాఖ దృష్టి సారించింది. వేరుశనగ సాగును రెట్టింపు చేయాలని నిర్ణయించింది. వచ్చే యాసంగిలో 5-6 లక్షల ఎకరాల్లో వేరు శనగ సాగయ్యేలా చర్యలు ప్రారంభించింది. దీనిపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నది. తెలంగాణ వేరుశనగకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉన్నది. కానీ ఆశించిన స్థాయిలో పంట సాగు కావడం లేదు. గత యాసంగిలో 2.78లక్షల ఎకరాల్లో సాగు కాగా.. అంతకుమందు 2.24 లక్షల ఎకరాల్లో మాత్రమే వేశారు. ఈ యాసంగిలో 5 లక్షల ఎకరాలకు మించి సాగుచేసేలా వ్యవసాయశాఖ దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందుకోసం పరిశోధనలను ప్రోత్సహిస్తున్నది. వేరుశనగలో నూతన వంగడాలు, చీడలను తట్టుకునే వంగడాలపై పరిశోధనలకు వ్యవసాయ వర్సిటీ, ఇక్రిశాట్ సంయుక్తంగా ఒప్పందం కుదుర్చుకున్నాయి.
డిమాండ్, ఆదాయం ఎక్కువ
దేశంలో నూనె గింజలకు అధిక డిమాండ్ ఉన్న నేపథ్యంలో వేరుశనగకు కూడా అధిక డిమాండ్ ఉంటున్నది. వేరుశనగ మద్దతుధర క్వింటాల్కు రూ.5,550గా ఉన్నది. ఒక్కోసారి రూ.7వేల వరకు పలుకుతున్నది. ఎకరాకు 10-15 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. సగటున 12 క్వింటాళ్ల వచ్చినా.. రూ.66వేల ఆదాయం వస్తుంది. పెట్టుబడి ఖర్చులు పోను రూ.40 వేల ఆదాయం ఉంటుంది.
అందుబాటులో కొత్త వంగడాలు…
రాష్ట్రంలో ప్రస్తుతం అధిక దిగుబడినిచ్చే వంగడాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కే-6, కే-9,కే- 1812 రకాలతోపాటు, కదిరి లేపాక్షి రకం కే-1812 రకంను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. కొత్తగా గిరినార్-4, గిరినార్-5 రకాలు అందుబాటులోకి వచ్చాయి. ఒక ఎకరాకు సగటున 90 కిలోల విత్తనాలు అవసరమవుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు.