లఖింపూర్ ఖేరి: ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఎనిమిదేండ్ల బాలిక మెడకు ఉరిబిగించి అత్యంత కిరాతకంగా హత్యచేశారు. లఖింపూర్ ఖేరీ జిల్లా పాస్గవాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటన సోమవారం ఉదయం వెలుగుచూసింది. ఉదయాన్నే అటుగా వెళ్లిన గ్రామస్తులకు గ్రామం సమీపంలోని ఓ చెరుకు తోటలో బాలిక మృతదేహం కనిపించింది.
బాలిక మెడకు సల్వార్ చుట్టి ఉన్నది. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక ఆధారాలను బట్టి బాలిక మెడకు ఉరిబిగించి హత్య చేసినట్లు తెలుస్తున్నదని, పోస్టుమార్టం నివేదిక వస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నదని పోలీసులు చెప్పారు. బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు కూడా అనుమానం వ్యక్తంచేశారు.