మండుటెండల్లో నిండుగా పారుతున్న కూడవెల్లి వాగు
ఎండాకాలంలో.. జీవనదిని తలపించేలా జల ప్రవాహం
బిరబిరా గోదారమ్మ పరవళ్లు..పులకించిన పుడమితల్లి
నిండుగా చెక్డ్యామ్లు, చెరువులు
ఎండుతున్న పంటలను తడుపుతున్న జలాలు..అన్నదాతల సంబురాలు
మల్లన్నసాగర్తో సస్యశ్యామలంగా మారుతున్న దుబ్బాక సెగ్మెంట్
దుబ్బాక, మార్చి 28 : తెలంగాణ రాష్ట్రం వస్తే దుబ్బాక బీడు భూములను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తామని నాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీని నేడు అక్షరాల నిజం చేశారు. మాటకు కట్టుబడి దుబ్బాక నియోజకవర్గానికి మల్లన్నసాగర్ ద్వారా గోదావరి జలాలను తరలించారు. ఇన్నాళ్లుగా నీళ్లులేక బీడుబారిన భూములు ఇక గోదావరి జలాలతో సస్యశ్యామలంగా మారుతున్నాయి. ఏడాదిలో మూడు పంటలు పండించుకునే అవకాశం దక్కింది. ఎడారిగా మారిన కూడవెల్లి వాగును గోదావరి జలాలతో వేసవిలో నిండుగా పారుతూ జీవనదిని తలపిస్తున్నది. ఎక్కడో పుట్టిన గోదారమ్మ బిరబిరా పారుతూ దుబ్బాక పుడమితల్లిని ముద్దాడడంతో రైతులు పరవశిస్తున్నారు. మండుటెండల్లో కూడవెల్లి వాగులో జలకళ సంతరించుకోవడంతో అంతటా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దుబ్బాక నియోజవర్గంలో ఓ పక్క కాల్వల ద్వారా చెరువులు, కుంటలు మత్తళ్లు దుంకుతుండగా.. మరోపక్క కూడవెల్లి వాగులో చెక్డ్యాంల నుంచి గోదారమ్మ పరవళ్లతో జలకళ సంతరించుకుంది. మండుటెండల్లో కూడవెల్లి వాగులో జలకళను చూసేందుకు నియోజకవర్గ ప్రజలు తరలివస్తున్నారు. చెరువులు, కుంటలు మత్తళ్లు దుంతుండడంతో సంభ్రమాశ్చర్యానికి గురవుతున్నారు. వాగులో జలసవ్వడులు చూసి కూడవెల్లి పరీవాహక ప్రాంతంలోని రైతులు జయహో కేసీఆర్ అంటూ.. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేస్తున్నారు.
జీవనదిగా కూడవెల్లి..
ఎండాకాలంలో ఎడారిని తలపించే కూడవెల్లి వాగు ఇక శాశ్వత జీవనదిగా మారనున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వాగులోకి గోదావరి జలాలు విడుదల చేయడంతో వేసవిలో జలకళతో కొత్తశోభ సంతరించుకుంది. దుబ్బాక నియోజకవర్గంలో ప్రధాన నీటి వనరైన కూడవెల్లి వాగు రానున్న రోజుల్లో ఏడాది పాటు నీటితో జీవనదిని తలపించనున్నది.భారీ వర్షాలు పడితేనే కూడవెల్లి వాగు పారేది. ఎండాకాలం ఆరంభంలోనే వాగులో నీరు పూర్తిగా ఇంకిపోయి ఎడారిగా మారేది. దీంతో పరీవాహక రైతులు యాసంగి పంట సాగుకోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూడవెల్లి వాగుకు జలకళ తెచ్చేందుకు మంత్రి హరీశ్రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రబాకర్రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో కొండపోచమ్మ కెనాల్ ద్వారా కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలను విడుదల చేయించారు. దీంతో కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలు పరవళ్లు తొక్కడంతో గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల రైతుల్లో ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. మల్లన్నసాగర్ కాల్వల ద్వారా దుబ్బాక నియోజకవర్గంలో 21చెరువులు నిండి మత్తళ్లు దుంకుతున్నాయి. కూడవెల్లి వాగులోకి కొడకండ్ల ఎత్తిపోతల పథకం నుంచి కూడవెల్లి వాగులోకి నీటిని మళ్లించడంతో అక్కడి నుంచి సుమారు 54కిలోమీటర్ల మేర వాగు గోదావరి జలాల ప్రవాహం కొనసాగుతున్నది. దుబ్బాక నియోజకవర్గం పరిధిలో 24చెక్డ్యాంలకు గాను ఇప్పటికే 22నిండి పొంగిపొర్లుతున్నాయి. మరో రెండు రోజు ల్లో మిగతా చెక్డ్యాంలు పూర్తిగా నిండి మిడ్మానేరులోకి గోదావరి జలాలు వెళ్లనున్నాయి. నియోజకవర్గంలో సూమారు 20వేల ఎకరాలకు పైగా సాగునీరు అందనున్నది
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు..
దుబ్బాక నియోజకవర్గంలో కూడవెల్లి వాగు జలకళ సంతరించుకోవడంతో రైతులు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. మండుటెండల్లో కూడవెల్లి వాగు నిండుగా ప్రవహించడంతో రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు. విమర్శకులు సైతం కూడవెల్లి వాగును సందర్శించి పూజలు నిర్వహించడం గమనార్హం. దుబ్బాక నియోజకవర్గంలో తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక మండలాల్లో కూడవెల్లి పరీవాహక రైతులు జయహో కేసీఆర్ అంటూ సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు, గోదావరి జలాలకు పూజలు చేసి సంబురాలు నిర్వహించుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..
ఈ లాభాలు తెలిస్తే.. ఇకపై కారం ఎక్కువగా తింటారు..!
మట్టికుండల్లో నీరే మంచిది.. ఎందుకంటే..?