బీజింగ్ : డ్రాగన్ దేశంలో న్యక్లియర్ పవర్ ప్లాంట్ లీకైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. చైనాలోని గాంగ్డాంగ్ ప్రావిన్సులో ఉన్న తైషాన్ అణు శక్తి కేంద్రంలో గ్యాస్ లీకైనట్లు ఇటీవల అమెరికా ఇంటెలిజెన్స్ పేర్కొన్నది. అయితే ఆ లీకేజీ వల్ల ఎటువంటి రేడియోధార్మిక ప్రభావం ఉందో అన్న కోణంలో అధ్యయనం చేస్తున్నారు. తైషాన్ అణుశక్తి ప్లాంట్ను ఫ్రాన్స్కు చెందిన కంపెనీ నిర్వహిస్తున్నది. ఆ ప్లాంట్ నుంచి రేడియేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఫ్రాన్స్ కంపెనీ ఫ్రామాటోమ్ డౌట్ వ్యక్తం చేసింది. కానీ ఇంకా అక్కడ సంక్షోభం తలెత్తే అవకాశాలు లేవని అమెరికా భావిస్తున్నది. అణుశక్తి ప్లాంట్లో వచ్చిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు ఫ్రాన్స్ కంపెనీ కూడా చెప్పింది.
ప్లాంట్లో జరిగిన లీకేజీ గురించి సంపూర్ణ వివరాలు ఇవ్వాలని ఫ్రామాటోమ్ కంపెనీ ప్లాంట్ బోర్డు సభ్యులను కోరింది. పర్ఫార్మెన్స్ ఇష్యూలో వచ్చిన సమస్యను పరిష్కరిస్తున్నట్లు ఫ్రామాటోమ్ తెలిపింది. సురక్షితమైన నియమావళి ప్రకారమే కంపెనీ పనిచేస్తున్నట్లు పేర్కొన్నది. తైషాన్ ప్లాంట్లో ఉన్న ఒకటో నెంబర్ రియాక్టర్లో నోబుల్ వాయువులు పెరుగుతున్నట్లు ఫ్రాన్స్ కంపెనీ అంచనా వేసింది. ఆర్గాన్, హీలియం, నియాన్ లాంటి వాయులు అక్కడ పేరుకుంటున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తైషాన్ పవర్ స్టేషన్ను చైనాకు ప్రభుత్వానికి చెందిన జనరల్ న్యూక్లియర్ పవర్ గ్రూపు ఆపరేట్ చేస్తున్నది. అయితే ఆ ప్లాంట్ వద్ద ప్రస్తుతం పరిస్థితు సాధారణ స్థితిలో ఉన్నట్లు ఆపరేటర్ ఓ ప్రకటనలో తెలిపారు. పవర్ స్టేషన్లో ఎటువంటి లీకేజీ లేదని చైనా ఆపరేటర్ పేర్కొన్నారు. ఈ ఘటన పట్ల చైనాతో సంప్రదింపులు జరిపినట్లు అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ పేర్కొన్నది. ప్రస్తుతానికి రేడియేషన్ సంఘటన ఏదీ జరగలేదని, మరింత సమాచారం వస్తే వెల్లడిస్తామని ఐఏఈఏ చెప్పింది.