హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): కొవిడ్-19 కారణంగా జీవనోపాధి కోల్పోయిన ట్యాక్సీ డ్రైవర్లకు తమ వాహన ఈఎంఐలు, బ్యాంకు రుణాల చెల్లింపులో మినహాయింపులు ఇస్తూ జారీచేసిన ఉత్తర్వులు ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేయాలని ఆర్బీఐ అధికారులు సూచించారు. బ్యాంకు అధికారులు వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారని, రుణం చెల్లించాలని వేధిస్తున్నారంటూ తెలంగాణ ట్యాక్సీడ్రైవర్ల జేఏసీ.. మల్కాజిగిరి ఎంపీ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జి మర్రి రాజశేఖర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. స్పం దించిన ఆయన సమస్యను ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ అదనపు పారిశ్రామిక సలహాదారు డీ చంద్రశేఖర్కు వివరించారు. ఈ విషయంపై చంద్రశేఖర్ ఈ నెల 15న ఆర్బీఐకి మెయిల్ ద్వారా సమాచారమిచ్చారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ వేధింపులకు పాల్పడితే ఆర్బీఐకి ఫిర్యాదు చేయవచ్చని ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ లేఖ రాశారు. బ్యాంకులపై ఫిర్యాదులకు ‘ది బ్యాంకింగ్ అంబుడ్స్మెన్, రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా, నంబర్-6-1-56, సెక్రటేరియట్ రోడ్, సైఫాబాద్, లేదా cms.bohyderabad@rbi.org.inలో ఫిర్యా దు చేయవచ్చని సూచించారు. నాన్బ్యాంక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్పై ‘ది బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ ఫర్ ఎన్బీఎఫ్సీ, రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫోర్ట్ గ్లాసిక్, చెన్నైలో లేదా cms.nbfcochennai@rbi.org.inలో ఫిర్యా దు చేయవచ్చన్నారు. మర్రి రాజశేఖర్రెడ్డి, డీ చంద్రశేఖర్కు ట్యాక్సీ, డ్రైవర్ల జేఏసీ తరఫున అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు. ఫిర్యాదులపై అవగాహన కు ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, నర్సాపూర్ క్రాస్రోడ్, బాలానగర్లో హెల్ప్డెస్క్ పెట్టినట్టు పేర్కొన్నారు.