మహబూబ్ నగర్ : ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు తెలిపారు. గురువారం ఆయన కలెక్టర్ కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులు, వైద్యాధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఏ ఏన్ ఎం లు, ఆశాలతో సీజనల్ వ్యాధులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సీజనల్ వ్యాధుల నివారణపై వెంటనే మండల స్థాయిలో తహసిల్దారులు,ఎంపీడీవోలు వైద్యాధికారులు, సర్పంచుల తో సమావేశాన్ని నిర్వహించాలని, వ్యాధుల నియంత్రణలో భాగంగా ముందు జాగ్రత్త చర్యలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించాలని ఇండ్లల్లో నీరు నిల్వ లేకుండా ఇంట్లో ఉన్న నీటిని బయట పారబోయాలని అన్నారు .దోమల నివారణకు పిచికారీ, ఫాగింగ్ కార్యక్రమాలను చేపట్టాలని, ఫాగింగ్ యంత్రాలు లేని గ్రామ పంచాయతీలు మూడు రోజుల్లో కొనుగోలు చేయాలని, ప్రతి వారం రోజులకు ఒకసారి ఫాగింగ్ చేయాలని తెలిపారు.
అదేవిధంగా ఎక్కడ నీరు నిల్వ లేకుండా గుంతలను పూడ్చివేయలని, పూడ్చివేయడానికి అవకాశం లేని గుంతలలో గంబుషియా చేపలు ,ఆయిల్ బాల్స్ వేయాలన్నారు. వారం రోజులలో వైకుంఠ ధామాలను పూర్తి చేయాలన్నారు. పారిశుధ్యం లో భాగంగా రహదారుల శుభ్రం, చెత్త తొలగింపుతో పాటు క్రమం తప్పకుండా తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయటం, క్లోరినేషన్ తో పాటు పారిశుధ్యం పై పట్టణాలలో గ్రామాలలో పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించాలనిఆన్నారు.
ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్ కు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్,రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, డీఆర్ ఓ స్వర్ణలత, ఆర్డీవో పద్మశ్రీ, డీఎం హెచ్ ఓ డాక్టర్ కృష్ణ, డీపీవో వెంకటేశ్వర్లు, డీఎఫ్ ఓ గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.