హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థ కారుణ్య నియామకాల్లో పెండ్లయిన, విడాకులు పొందిన కుమార్తెలు, ఒంటరి మహిళలకు అవకాశం కల్పిస్తూ సంస్థ డైరెక్టర్ బలరాం మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. సింగరేణి డైరెక్టర్ల బోర్డు నిర్ణయం మేరకు ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. వీటిని 2018 మార్చి 9 నుంచి వర్తింపచేయనున్నారు. సింగరేణి కారుణ్య నియామకాల్లో ఇప్పటివరకు అవివాహిత కుమార్తెలు, కుమారుడు, చట్ట ప్రకారం దత్తత తీసుకున్న కుమారుడికే అవకాశం కల్పించేవారు. వీరు లేనిపక్షంలో ఉద్యోగితోపాటు నివసిస్తూ అతని జీతంపైనే ఆధారపడిన సోదరుడు, వితంతు కుమార్తె, కోడలు, అల్లుడుకి మాత్రమే కారుణ్య ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉండేది. తాజాగా గుర్తింపు కార్మిక సంఘం విజ్ఞప్తి మేరకు పూర్తిగా ఉద్యోగులపైనే ఆధారపడిన వివాహిత కుమార్తెలు, విడాకులు పొందిన కుమార్తెలు, ఒంటరి మహిళలకుకూడా కారుణ్య నియామకాల్లో అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. 2018 నుంచి ఇప్పటివరకు సింగరేణిలో 82 మెడికల్ బోర్డులను నిర్వహించి దాదా పు 7 వేల మంది వారసులకు ఉద్యోగాలు కల్పించారు.