హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): డిగ్రీ కోర్సుల్లో కామర్స్ రారాజుగా నిలుస్తున్నది. ఉద్యోగావకాశాలు పుష్కలంగా లభిస్తుండటంతోనే ఈ కోర్సుల్లో చేరేందుకు ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తికనబరిచారు. ముఖ్యంగా విద్యార్థినులు కామర్స్ కోర్సులనే ఎంచుకున్నారు. బుధవారం మాసాబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) సీట్ల కేటాయింపును బుధవారం అధికారులు పూర్తిచేశారు. తొలివిడతలో 1,67,130 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. వీరిలో 78,021 మంది అబ్బాయిలు, 89,109 మంది అమ్మాయిలు ఉన్నారు. సీట్లు పొందినవారిలోనూ కామర్స్ విద్యార్థులే అధికంగా ఉండటం విశేషం. 39.43 శాతం కామర్స్ తస్సంబంధ కోర్సుల్లో ప్రవేశాలు పొందారు. గతేడాది 37.73 శాతం మాత్రమే ఉండగా, ఈ ఏడాది రెండు శాతం అధికంగా చేరారు. ఆర్ట్స్ కోర్సుల్లో 13.52 శాతం, లైఫ్ సైన్సెస్లో 19.75 శాతం, ఫిజికల్ సైన్స్లో 21.38 శాతం, డాటా సైన్స్లో 1.96 శాతం మంది విద్యార్థులు సీట్లు పొందారు. దోస్త్లో 950 కాలేలుండగా, 501కోర్సుల్లో, 4,08,345 సీట్లు ఉన్నాయి. మొత్తంగా 1,81,638 మంది దరఖాస్తులు చేసుకోగా, 1.67 లక్షల మంది సీట్లు పొందారు. దోస్త్ రెండోవిడత రిజిస్ట్రేషన్లు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 18 వరకు రిజిస్ట్రేషన్లతోపాటు వెబ్ఆప్షన్లను సైతం ఎంచుకోవచ్చు. దోస్త్లో 950 కాలేలుండగా, 501 కోర్సుల్లో, 4,08,345 సీట్లు ఉన్నాయి. దోస్త్ మొదటివిడతలో 1,81,638 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 1.67 లక్షల మంది సీట్లు పొందారు. సీట్లు 14,508 మందికి రెండోవిడతలో సీట్లను కేటాయించనున్నారు. ఇంగ్లిష్ మీడియంలోనే 85 శాతానికిపైగా విద్యార్థులు చేరారు.
డిగ్రీలో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లోనే చేరుతున్నారు. ఈ ఏడాది డిగ్రీలో 99.40 శాతం మార్కులతో దోస్త్ టాపర్గా నిలిచిన మిట్టపల్లి అక్షయ నిజాం కాలేజీలో బీఎస్సీ (ఫిజికల్ సైన్స్లో) రెండో ర్యాంక్లో నిలిచిన స్వాతి హన్మకొండ సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో బీఎస్సీ (లైఫ్ సైన్సెస్)లో సీట్లు పొందారు. మూడో ర్యాంక్ సాధించిన కొన్నె రాజేశ్ హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో, నాలుగో ర్యాంకర్ హృషికేర్ నిజాం కాలేజీలో సీట్లు కైవసం చేసుకున్నారు.