హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నగరంలో అత్యధునాతన సాంకేతికతతో నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం డీజీపీ మహేందర్ రెడ్డి, ఆర్అండ్బీ అధికారులతో కలిసి పరిశీలించారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అత్యధునాతన టెక్నాలజీతో ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో పొలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మిస్తున్నామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
దృఢ సంకల్పంతో నిర్మిస్తున్న ఈ కట్టడం ప్రపంచంలోనే అద్భుత నిర్మాణాల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు. 60 రోజుల్లో నిర్మాణ పనులు పూర్తి కావాలని వర్క్ ఏజెన్సీ షాపూర్ పల్లోన్జీ ప్రతినిధులను మంత్రి ఆదేశించారు. లాక్డౌన్ నేపథ్యంలో పనులు నెమ్మదించినందున ఇప్పడు రెట్టింపు సంఖ్యలో కార్మికులను వినియోగించి వేగం పెంచాలన్నారు. కచ్చితంగా మూడు షిప్టులల్లో 24 గంటలు నిరంతరాయంగా వేగంగా పనులు జరిగేలా చూడాలని అధికారులను, వర్క్ ఏజెన్సీని ఆదేశించారు. నిర్మాణ పనులను వారానికి ఒకసారి ఆకస్మికంగా తనిఖీ చేస్తానని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.