జమ్మికుంట, ఆగస్టు 28 : ఆమె పేరు శనిగరపు లక్ష్మి. దళిత మహిళ. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఎరుకల వాడలో 20 ఏండ్లుగా ఉంటోంది. భర్త అయిలయ్య రెండేళ్ల క్రితం మృతిచెందాడు. లక్ష్మికి నలుగురు కొడుకులు. ఇద్దరు బిడ్డలు. నలుగురు కొడుకులు వేర్వేరుగా ఉంటున్నారు. వీరిలో ఒక్క కొడుక్కు మాత్రమే 2014కు ముందు పళ్లైంది. సమగ్ర కుటుంబ సర్వేలో పేరు నమోదైంది. తర్వాత ముగ్గురు కొడుకులకు పళ్లైంది. కానీ, ఎస్కేఎస్లో నమోదు కాలేదు. నలుగురు కొడుకులు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో దళితబంధు సర్వే మొదలైంది. అప్పటినుంచి వారిలో ఆందోళన మొదలైంది. దళితబంధు వస్తదో లేదో అని దిగులు చెందారు. కాగా, శనివారం ఎరుకలవాడకు దళితబంధు సర్వే కోసం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వచ్చారు. సర్వే బృందంతో కలిసి నేరుగా లక్ష్మి ఇంటి తలుపుతట్టారు. కలెక్టర్ తమ ఇంటికి రావడంతో కుటుంబమంతా ఆశ్చర్యానికి గురయ్యారు. నేలపై కూర్చుని కుటుంబ పెద్ద లక్ష్మితో మాట్లాడారు. నలుగురు కొడుకుల్లో ముగ్గురికి సమగ్ర కుటుంబ సర్వేలో పేర్లు లేవని తెలుసుకున్నారు. వెంటనే ఫారాలు తెప్పించి, అప్పటికప్పుడే దళితబంధు సర్వేలో చేర్చాలని అధికారులను ఆదేశించారు. దీంతో లక్ష్మి కుటుంబం మురిసిపోయింది. దళిత వాడ సంబుర పడింది. అంతకు ముందు కలెక్టర్ హుజూరాబాద్ పట్టణంలోని ఎస్డబ్ల్యూకాలనీ, గాంధీనగర్, ఇందిరానగర్లోనూ డోర్టూ డోర్ సర్వేను పరిశీలించారు.
రెండో రోజూ కొనసాగిన సర్వే
రెండో రోజు శనివారం సర్వే విజయవంతంగా సాగింది. హుజూరాబాద్ పట్టణంలోని 16, 29, 13వ వార్డులతోపాటు మండలంలోని సింగాపూర్, జూపాక, రాంపూర్, రంగాపూర్, ధర్మరాజుపల్లి గ్రామాల్లో సర్వే చేశారు. జమ్మికుంట పట్టణంలోని 5, 2, 10, 13, 14వ వార్డులతోపాటు మండలంలోని కోరపల్లి, తనుగుల, బిజిగిరి, నాగంపేట, నగురం, వెంకటేశ్వర్లపల్లి, విలాసాగర్ గ్రామాల్లో సర్వే చేపట్టారు. ఇల్లందకుంట మండలకేంద్రంతోపాటు కనగర్తి, సిరిసేడు, మల్యాల, వీణవంక మండలకేంద్రంతో పాటు బేతిగల్, ఘన్ముక్ల వల్భాపూర్, మామిడాలపల్లి, బొంతుపల్లి, పోతిరెడ్డిపల్లి, కమలపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో సర్వే కొనసాగించారు.