ఆదిలాబాద్ : నిర్మల్ జిల్లాలోని బాసరలోని ట్రిపుల్ ఐటీని మంగళవారం లెక్టర్ ముషారఫ్ ఫారూఖీ సందర్శించారు. క్యాంపస్ అభివృద్ధి పనులు, బోధన యంత్రాల పని తీరు మరమ్మతులు, సుందరీకరణ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.కలెక్టర్ స్వయంగా క్యాంపస్లోని ల్యాబొరేటరీలను, తరగతి గదులను, వసతిగృహాలు, క్రీడా ప్రాంగణాలు, ఆడిటోరియం, వ్యాయామశాలలు సందర్శించి వాటి పనితీరును పరిశీలించారు.
ల్యాబరేటరీలో యూనివర్సల్ టెస్టింగ్ మిషన్, ఎక్స్ రే డై ఫ్రాక్షన్ మిషన్ తదితర మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గత సంవత్సరం షాట్ సర్క్యూట్ వల్ల కాలిపోయిన భాగాన్ని వెంటనే మారమ్మతులు చేయించాలని ఆదేశించారు. విద్యార్థులకు అందిస్తున్న బోధన తదితర అంశాలను అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. క్యాంపస్ సుందరీకరణపై శ్రద్ధ వహించాలని, ప్రతి అంశం పై శ్రద్ధ తీసుకోవాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
అనంతరం అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్ఖడే, పి. రాంబాబు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ట్రిపుల్ ఐటీ ఏవో ప్రొఫెసర్ రాజేశ్వర్రావు, సివిల్ డీఈ ఎం. రాజాకిషన్ రెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ జి. రంజిత్ కుమార్ కోఆర్డినేటర్ రాకేశ్ రెడ్డి, బైంసా ఏఎస్పీ కిరణ్, తాసిల్దార్ శ్రీకాంత్, త్రిపుల్ ఐటీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.