లక్నో: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన ట్వీట్లతో సమాజంలో విషం చిమ్ముతున్నారని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. ఇటీవల యూపీలో ఓ ముస్లిం వ్యక్తిపై దాడి జరిగింది. జైశ్రీరామ్ అని పలకనందుకు అతనిపై దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీంట్లో మత కోణం ఉందంటూ రాహుల్ ఆరోపించారు. కానీ ఆ ఘటనలో ఎటువంటి మతపరమైన కోణం లేదని పోలీసులు తేల్చారు. పోలీసులు చెప్పినా రాహుల్ మాత్రం నిజం మాట్లాడడం లేదని, ఆయనకు సత్యం మాట్లాడడం తెలియని సీఎం యోగి అన్నారు. రాహుల్ ట్వీట్లకు కౌంటర్ ఇచ్చిన యోగి.. శ్రీరాముడు తొలుత నేర్చుకున్నది సత్యం మాట్లాడటం అని, అది మీరు మీ జీవితంలో ఎప్పుడూ చేయలేని రాహుల్ను విమర్శించారు. సమాజంలో విషాన్ని వ్యాపింపచేస్తున్నారని, అధికారం కోసం మానవత్వాన్ని మరిచిపోతున్నారని కాంగ్రెస్ నేతపై యూపీ సీఎం ఆరోపణలు చేశారు.
ముస్లిం వృద్ధుడిపై దాడి చేయడం సమాజానికి, మతానికి సిగ్గు చేటు అని అంతకముందు రాహుల్ ట్వీట్ చేశారు. నిజమైన శ్రీరాముడి భక్తులు ఇలా చేసి ఉంటారని అనుకోవడం లేదని రాహుల్ అన్నారు. బులంద్షెహర్కు చెందిన 71 ఏళ్ల సూఫీ అబ్దుల్ సమద్పై దాడి జరిగింది. ఘజియాబాద్లో జరిగిన దాడిలో ఆ వృద్ధుడి గడ్డాన్ని కూడా కట్ చేసినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ గూఢాచారి అతను అని, జై శ్రీరామ్ నినాదం చేయాలని ఆ వృద్ధుడిపై వత్తిడి చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు జూన్ ఏడవ తేదీన కేసు నమోదు చేశారు. వృద్ధుడిపై దాడి చేసిన కేసులో పర్వేశ్ గుజ్జర్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.