హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 28 (నమస్తే తెలంగాణ): లిమిటెడ్ కంపెనీ రిజిస్ట్రేషన్తో ఐఐటీ కోచింగ్ ఇస్తున్న ఓ సంస్థకు రాష్ట్ర వినియోగదారుల కమిషన్ దిమ్మదిరిగే తీర్పు వెలువరించింది. కోచింగ్ నచ్చక మానేసిన విద్యార్థి నుంచి వసూలు చేసిన ఫీజు రూ.4.45 లక్షలతో పాటు ఖర్చులకు రూ.50 వేలు చెల్లించాలని తీర్పునిచ్చింది. ఆ మొత్తాన్ని 45 రోజుల్లోపు చెల్లించాలని, లేకపోతే 9 శాతం వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుందని వినియోగదారుల కమిషన్ హైదరాబాద్-2 అధ్యక్షుడు వక్కంటి నర్సింహారావు, సభ్యులు పీవీటీఆర్ జవహర్బాబు, ఆర్ఎస్ రాజేశ్రీ ఇచ్చిన తీర్పులో స్పష్టం చేశారు. చిలకలగూడ వెస్లీ చర్చి సమీపంలోని ఆర్వీ పద్మాలక్ష్మి అపార్ట్మెంట్లో నివసించే శీలం శ్రీనివాస్.. సైఫాబాద్లోని సహారా మంజిల్ భవనంలోని ఎఫ్ఐఐటీజేఈఈ(ఫిట్జీ) లిమిటెడ్లో ఐఐటీ కోచింగ్ కోసం తన కుమారుడిని 2019 జనవరి 10న జాయిన్ చేశారు. రెండేండ్ల కోర్సు ఫీజు రూ.4,35,458.90 చెల్లించారు. 17 రోజులే క్లాసులకు హాజరైన ఆ విద్యార్థి అక్కడ బోధన సరిగా లేక వెళ్లటం మానేశాడు. తరగతులకు హాజరైన కాలానికి ఫీజు తీసుకొని మిగిలిన ఫీజు తిరిగి ఇవ్వాలని విద్యార్థి కుటుంబసభ్యులు కోరారు. అందుకు ఫిట్జీ ప్రతినిధులు ఒప్పుకోలేదు. దీంతో శ్రీనివాస్ 2019 జూలై 31న వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు.
విచారణకు హజరైన ఫిట్జీ.. తమ సంస్థ వినియోగదారుల ఫోరం పరిధిలోకి రాదని వాదించింది. వాస్తవానికి విద్యాసంస్థలు వినియోగదారుల ఫోరం పరిధిలోకి రావు. కానీ విద్యార్థి దగ్గర వసూలుచేసిన ఫీజులో రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ రూపంలో సుమారు రూ.50 వేలు వసూలు చేశారు. ఈ విషయాన్ని ఆధారాలతో సహా శ్రీనివాస్ ఫోరానికి సమర్పించారు. ఇరు పక్షాల వాదనలను విన్న కమిషన్.. వినియోగదారుల ఫోరం 1986 యాక్ట్లోని సెక్షన్-12 ప్రకారం లిమిటెడ్ కంపెనీలు వసూలు చేయాల్సిన జీఎస్టీని విద్యాసంస్థ వసూలు చేయటం, లిమిటెడ్ కంపెనీగా రిజిస్ట్రేషన్ చేసుకొని విద్యాసంస్థను నిర్వహించటంపై కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థి నుంచి ఫీజు వసూలు చేసినట్టు గుర్తించి, అడ్మిషన్ ఫీజు రూ.10 వేలు మినహా మొత్తం ఫీజు రూ.4,35,458.90 చెల్లించాలని ఎఫ్ఐఐటీజేఈఈ లిమిటెడ్ను ఆదేశించింది. బాధితులను ఇబ్బందికి గురి చేసినందుకు రూ.50 వేలు, వివాదం సృష్టించినందుకు మరో రూ.10 వేలు కలుపుకొని 45 రోజుల్లో చెల్లించాలని కమిషన్ తీర్పు ఇచ్చింది.