న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సెకండ్ వేవ్ తీవ్రత దాదాపు తగ్గిన నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఇప్పటికే అనేక సడలింపులు ఇచ్చింది. సోమవారం నుంచి బార్లు, పబ్లిక్ పార్కులు, ఉద్యానవనాలను తెరిచేందుకు అనుమతి ఇస్తూ ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (డీడీఎంఏ) ఉత్తర్వులు జారీచేసింది. 50 శాతం సామర్థ్యంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బార్లను తెరిచి ఉంచవచ్చని తెలిపింది.
అయితే కొవిడ్ నిబంధనలను సక్రమంగా అమలు చేసే బాధ్యత బార్ల యజమానులదేనని పేర్కొన్నది. ఇక పబ్లిక్ పార్కులు, ఉద్యానవనాలు, గోల్ఫ్ క్లబ్లు, ఆరు బయట యోగా కార్యక్రమాలకు కూడా డీడీఎంఏ అనుమతి ఇచ్చింది. పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలు, సినిమాలు, జిమ్లు, స్పాలలో ఎలాంటి రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు చేపట్టరాదని ఆదేశించింది.