అన్ని రంగాల్లో ముందంజలో నిజాంసాగర్
పల్లెప్రగతి పనులు భేష్
సకల వసతులతో వైకుంఠధామం
ప్రత్యేక ఆకర్షణగా పల్లె ప్రకృతి వనం
ఫలాలను అందిస్తున్న మంకీఫుడ్ కోర్టు
నిజాంసాగర్, మార్చి 15 : పల్లెప్రగతి పనులన్నీ పూర్తిచేసుకుని అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తున్నది నిజాంసాగర్ మండలకేంద్రం. పల్లె ప్రగతిలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రకృతివనం కామారెడ్డి జిల్లాలోనే ఆదర్శంగా నిలిచింది. రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలతో వీధులు హరితశోభను సంతరించు కున్నాయి. మంకీఫుడ్ కోర్టులో నాటిన 1500 మొక్కలు ఏపుగా పెరిగాయి. కంపోస్టుషెడ్డు, వైకుంఠధామం అందుబాటులోకి వచ్చాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంతో నిజాంసాగర్ గ్రామ రూపురేఖలు మారిపోయాయి. అన్ని హంగులతో వైకుంఠధామం నిర్మించారు. బస్టాండ్ పక్కనే సువిశాలమైన స్థలంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం పూల మొక్కలతో ఎంతో ప్రశాంతతను అందిస్తున్నది. పల్లె ప్రకృతి వనం జిల్లాలోనే ఆదర్శంగా నిలిచింది. కంపోస్టు షెడ్డు, డంపింగ్యార్డు ఏర్పాటు చేశారు. గ్రామంలోని ప్రతి రహదారికి ఇరువైపులా మొక్కలు నాటి వాటికి కంచెలను ఏర్పాటు చేసి ట్యాంకరు ద్వారా నీటిని అందిస్తుండడంతో ఏపుగా పెరిగాయి. కోతుల ఆహారశాలలో నాటిన 1500 మొక్కలు ఏపుగా పెరిగి కాయలు, పండ్లు సైతం అందిస్తున్నాయి. నిత్యం ఇంటింటి చెత్తసేకరణ, మురుగు కాలువలను శుభ్రం చేయడంతో స్వచ్ఛ గ్రామం దిశగా అడుగులు వేస్తున్నది. వైకుంఠధామం చుట్టూ కంచెను ఏర్పాటు చేసి వాటిలో మొక్కలుసైతం నాటారు. పక్కనే కంపోస్టు షెడ్డు, డంపింగ్ యార్డును నిర్మించి బోరుబావినిసైతం ఏర్పాటు చేసి నీటి వసతి కల్పించారు. వైకుంఠధామంలో పురుషులకు, మహిళలకు వేర్వేరుగా దుస్తులు మార్చుకునే గదులు, స్నానాలు చేసేందుకు గదులను నిర్మించారు.
ఫలాలనిస్తున్న కోతుల ఆహార శాల
నిజాంసాగర్ మండల కేంద్రానికి కిలో మీటరు దూరంలో కోతుల ఆహారశాలను ఏర్పాటు చేశారు. ఇందులో జామ, సీమచింత, దానిమ్మ, అల్లనేరేడు, సపోట, మామిడి, సీతాఫలం, బాదాం మొక్కలను నాటారు. అన్ని రకాలు కలిపి 1500 మొక్కలు నాటారు. వాటికి ప్రతి రోజూ నలుగురు కూలీలతో నీటిని అందిస్తుండడంతో ప్రస్తుతం కాయలు సైతం అందిస్తున్నాయి.
ప్రగతి పనుల్లో ముందంజ..
పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాన్ని అభివృద్ధి బాట పట్టించాం. ప్రజాప్రతినిధిగా గ్రామస్తులకు మౌలిక వసతులు కల్పించే అవకాశం కలిగింది. ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, కంపోస్టుషెడ్డు, కోతుల ఆహారశాల నిర్మాణాలు చేపట్టాం. పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా చేపడుతున్నాం.
-ఉమారాణి, సర్పంచ్, నిజాంసాగర్