కరీంనగర్: బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడే అర్హత మాజీ మంత్రి ఈటల రాజేందర్కు లేదని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. ఈటల అధీనంలో ఉన్న పేదల భూములను బాధితులకు ఇప్పించండి అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని కోరుతున్నానని, లేదంటే ఈటల అవినీతికి మీరు మద్దతు ప్రకటించినట్లేనని గంగుల తెలిపారు. కరీంనగర్లో మంత్రి గంగుల మీడియా సమావేశంలో మాట్లాడారు.
‘ఆత్మగౌరవం పేరుతో ఈటల బడుగు బలహీనవర్గాలను మోసం చేస్తున్నారు. ఆత్మగౌరవం అన్న నీవు ఢిల్లీలో ఎక్కడ తాకట్టు పెట్టావు. కారుకు ఓనర్ అన్న నీవు బీజేపీకి క్లీనర్ అయ్యావా. బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి ఆత్మగౌరవం ఇస్తారని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పారా. నల్ల చట్టాలను తెల్లచట్టాలు చేస్తామని ఏమైనా హామీ ఇచ్చారా. బలహీన వర్గాలకు కేంద్రంలో మంత్రి పదవులు ఇస్తామని చెప్పారా. ఆత్మగౌరవం గురించి బీజేపీ ఏం హామీ ఇచ్చిందో ఈటల చెప్పాలి. ఏడేళ్ల నుంచి ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా. ఈటల సీఎం కేసీఆర్ బొమ్మపైనే గెలిచారు. ఆస్తుల రక్షణ కోసమే ఈటల బీజేపీలోకి వెళ్తున్నారు. హుజురాబాద్లో ఈటల వందశాతం ఓడిపోవడం ఖాయం. హుజురాబాద్లో బలంగా ఉన్నది టీఆర్ఎస్..ఈటల కాదు. ఈటల బీజేపీలో చేరితే అక్కడ ఆపార్టీకి ఉన్న ఓట్లు కూడా పోతాయని’ మంత్రి పేర్కొన్నారు.