హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): వరి పంటను నాటు పద్ధతి కాకుండా వెదజల్లే పద్ధతి ద్వారా సాగుచేస్తే పెట్టుబడి మిగులుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. శనివారం ప్రగతిభవన్లో వ్యవసాయశాఖపై జరిగిన సమీక్ష సమావేశంలో వరి నాటులో ధాన్యం వెదజల్లే పద్ధతి గురించి ప్రత్యేకంగా చర్చించారు. రెండు పంటలకు కలిపి కోటి ఎకరాలు సాగుచేసే తెలంగాణ రైతులకు సుమారు రూ.10 వేల కోట్లపైనే పెట్టుబడి మిగులుతుందని పేర్కొన్నారు. ఈ పద్ధతిలో వరి సాగుచేస్తే ఎకరానికి 2-3 బస్తాలు అధిక దిగుబడి రావొచ్చని పేరొన్నారు. ఈ పద్ధతిలో వరి సాగుచేసే అంశంపై రైతుల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
‘వెదజల్లే పద్ధతి ద్వారా నారుపోసే పని ఉండదు, నారు పీకే పని ఉండదు. నాటు పెట్టే పని ఉండదు. కూలీల కోసం గొడవ ఉండదు. కలుపు కూలీల ఇబ్బంది ఉండదు. నీటి వినియోగం 30 నుంచి 35% తగ్గుతుంది. 10-15 రోజుల ముందు క్రాప్ వస్తుంది. మామూలు పద్ధతిలో ఎకరానికి 25 కిలోల విత్తనాలు కావాలి. ఈ వెదజల్లే పద్ధతి అయితే 8 కిలోల విత్తనాలు సరిపోతాయి. వడ్లు వెదజల్లిన తరువాత ఎన్ని రోజులకైనా నీళ్లు కట్టుకోవచ్చు. విత్తన పొడ్లు వెదజల్లినంక వర్షం పడేదాక కొన్నిరోజులు ఎదురుచూస్తే ఇంకా మంచిది. కాళేశ్వరం సహా అన్ని సాగునీటి ప్రాజెక్టులు, లిఫ్టులు, సుమారు 30 లక్షల బోరుబావుల పరిధిలో వరి సాగుచేసే రైతులకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. ఖమ్మం జిల్లాలో ఈ వెదజల్లే పద్ధతిలో వరి రైతులను పిలిచి దీనిపై స్టడీ చేశాను. నేను రైతును కాబట్టి నా పొలంలో ఈ విధానంలో వరి సాగుచేసి మంచి ఫలితాలు పొందాను. ఈ పద్ధతిలో విత్తనపొడ్లు చల్లడానికి పరికరాలు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలో వరి సాగుచేసే రైతులందరూ ఈ పద్ధతిని అనుసరిస్తే మంచిది’ అని సీఎం వివరించారు.