ప్రకృతిలో భాగమై నివసించే అడవిబిడ్డలు, అత్యంత స్వచ్ఛమైన మనుషులు, మానవ సమాజంలో కల్మశం లేని మానవీయ సంబంధాలకు ఆదివాసీ బిడ్డలు ప్రతీకలు.. అని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆదివాసీ సోదరులకు కేసీఆర్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
స్వయం పాలనలో తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం అనే కార్యక్రమాలు అమలు చేస్తున్నది. ఆదివాసీ గూడేల్లో విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక వసతుల కోసం ప్రభుత్వం పటిష్ఠ చర్యలను చేపట్టింది. వారి ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేకమైన వైద్య సౌకర్యాలు కల్పించిందని సీఎం స్పష్టం చేశారు.
మా తండాలో, మా గూడెంలో మా రాజ్యం.. అనే ఆదివాసీ గిరిజనుల ఆకాంక్షలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చింది. ఆదివాసీలను స్వయం పాలనలో భాగస్వాములను చేసే దిశగా గూడేలను, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి.. సర్పంచులయ్యే అవకాశం కల్పించి.. రాష్ట్ర రాజకీయ పాలనా వ్యవస్థలో భాగస్వామ్యం చేసింది.. అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.