హైదరాబాద్ : రాష్ట్రంలో బుధ, గురువారాల్లో కూడా వానలు పడనున్నాయి. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి ఇంటీరియర్ కేరళ మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నది. దీని ప్రభావంతో తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం రాష్ట్రంలోని పలుచోట్ల ఓ మోస్తరు వానలు పడడంతో వాతావరణం కొంత చల్లబడింది. వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, హైదరాబాద్లో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిశాయి. బుధ, గురువారాల్లో నైరుతి, ఉత్తర, తూర్పు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు.