హైదరాబాద్ : నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాలకు మంజూరైన మెడికల్ కాలేజీలకు త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. గద్వాల నర్సింగ్ కాలేజీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మెడికల్, నర్సింగ్ కాలేజీలకు శంకుస్థాపన ఏర్పాట్లు, అకాల వర్షాలపై నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మంత్రి నిరంజన్ రెడ్డి బుధవారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సాగునీటి కాల్వలు నిండుగా ప్రవహిస్తున్న నేపథ్యంలో వర్షాలు కురిసినప్పుడు తెగిపోయే సమస్య రాకుండా బలహీన కాల్వలు గుర్తించి మరమ్మతులు చేసేలా నీటిపారుదల శాఖ అధికారులతో కలెక్టర్, ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించి ఆదేశించాలి. గ్రామాలలో కూలిపోయే దశలో ఉన్న ఇండ్లను గుర్తించి అలాంటి కుటుంబాలను అప్రమత్తం చేయాలి. హరితహారం కింద మిగిలిపోయిన చోట్ల (గ్యాప్ ఫిల్లింగ్) వెంటనే మొక్కలు నాటాలి.. అక్టోబరు నెలతో చలికాలం మొదలయితే మొక్కలు ఎదగవు అని మంత్రి పేర్కొన్నారు.
నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాలకు నూతనంగా మెడికల్ కళాశాలలు మంజూరయ్యాయి. గద్వాలలో నర్సింగ్ కళాశాల కూడా మంజూరైంది అని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వీటి నిర్మాణం కోసం కేటాయించిన స్థలాల విషయంలో కొందరు గిట్టని వారు సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. గద్వాల నర్సింగ్ కళాశాలకు కేటీఆర్, వనపర్తి , నాగర్కర్నూల్ జిల్లాల్లో మెడికల్ కాలేజీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో శంకుస్థాపన చేస్తారు.
గ్రామాలు, పట్టణాలలో పారిశుద్ధ్య పనులను తరచుగా చేపడుతూ ఉండాలి అని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. కొత్తగా పాఠశాలలను తెరుస్తున్న నేపథ్యంలో బలహీనంగా ఉన్న పాఠశాలల భవనాలను గుర్తించాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ నిధులను పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకే వినియోగించాలి. కలెక్టర్లు వీలైనన్ని ఎక్కువ పాఠశాలలను సందర్శించి చర్యలు తీసుకోవాలి. గ్రామాలలో జ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి. భారీ వర్షాలకు తెగిన, దెబ్బతిన్న రోడ్లు, చెరువుల మరమ్మతుకు చర్యలు తీసుకోవాలి.
నూతనంగా వచ్చిన జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల కలెక్టర్లకు అభినందనలు.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి పేరు తెచ్చుకోవాలి అని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు.