హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులు, కార్మికుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి.. కే చంద్రశేఖర్రావు అని టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్కేవీ అనుబంధ తెలంగాణ రాష్ట్ర గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల (ఆశా) సంఘ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆశా వర్కర్లకు 30 శాతం జీతం పెంచినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాంబాబు మాట్లాడుతూ.. 30 శాతం పీఆర్సీని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వర్తింపజేసినందుకు ప్రతి ఉద్యోగి సంతోషంగా ఉన్నారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని అన్నారు. ఆశావర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్కేవీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి శివశంకర్, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు బీ కృష్ణయ్య, ఆశా నేతలు కరుణ, అపర్ణ, శోభ, లక్ష్మి , సరస్వతి, కవిత తదితరులు పాల్గొన్నారు.