CM KCR | హైదరాబాద్ : హైదరాబాద్ నగరం నడిబొడ్డున నిర్మిస్తున్న నూతన సచివాలయం( New Secretariat ) పనులను ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) శుక్రవారం మధ్యాహ్నం పరిశీలించారు. తుది మెరుగులు దిద్దుకుంటూ ప్రారంభానికి సిద్ధమవుతున్న నూతన సచివాలయాన్ని చూసి సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్( Ambedkar Statue ) 125 అడుగుల విగ్రహం, తెలంగాణ అమరవీరుల జ్యోతి నిర్మాణ పనుల పురోగతిని కేసీఆర్ పరిశీలించారు.
శుక్రవారం మధ్యాహ్నం ప్రగతి భవన్ నుంచి బయల్దేరిన కేసీఆర్.. నేరుగా కొత్త సచివాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా చివరి దశకు చేరుకున్న ఎలివేషన్ పనులను, ఫౌంటేన్, గ్రీన్ లాన్, టూంబ్ నిర్మాణం దానికి తుది దశలో అమరుస్తున్న స్టోన్ డిజైన్ వర్కు తదితర పనుల పురోగతిని పరిశీలించారు. సెక్రటేరియట్ ప్రధాన ద్వారం అత్యంత విశాలంగా నిర్మించిన తీరును, భోపాల్ నుంచి ప్రత్యేకంగా వుడ్ కార్వింగ్ చేసి తెప్పించి అమర్చిన ద్వారాన్ని పరిశీలించిన సీఎం సంతృప్తిని వ్యక్తం చేశారు.
అనంతరం సీఎం చాంబర్ వుండే ఆరో అంతస్తుకు కేసీఆర్ చేరుకున్నారు. సీఎం చాబంర్ లో ఏర్పాటు చేసిన టేబుల్స్, కుర్చీలు తదితర ఫర్నీచర్ను సీఎం పరిశీలించారు. గత పర్యటన సందర్భంగా కేసీఆర్ చేసిన సూచనల మేరకు వాల్ క్లాడింగ్, డెకరేషన్ తదితర తుదిమెరుగులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తెల్లని రంగుతో కూడిన గోల్డ్ కలర్ పట్టీలతో తీర్చిదిద్దిన గోడలు, గోడల రంగుతో సరిపోయే విధంగా వేసిన మార్బుల్ ఫ్లోరింగ్, విశాలమైన కారిడార్లు, అంతే అందంగా తీర్చిదిద్దిన చాంబర్ల ద్వారాల పనితీరును పరిశీలించి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, అధికారులను, వర్క్ ఏజెన్సీ అధికారులను సీఎం అభినందించారు. నిర్మాణం పూర్తయిన తరువాత అక్కడ చోటు చేసుకున్న గాలి వెలుతురుతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని గమనించి సీఎం ఆనందం వ్యక్తం చేశారు.
సీఎం చాంబర్లోని సమావేశ మందిరాన్ని కేసీఆర్ పరిశీలించారు. సీఎంవో సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన చాంబర్లను, అందులో అమరుస్తున్న ఫర్నీచర్ను తిలకించారు. ఏర్పాట్లన్నీ సిబ్బంది పనికి అనుకూలంగా వుండే విధంగా వున్నాయా లేవా అని ఆరా తీశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చాంబర్ను, వారి సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన కార్యాలయాలను, కాన్ఫరెన్స్ హాల్ను, సందర్శకుల కోసం వేచివుండే గదులను అందులోని సౌకర్యాలను సీఎం పరిశీలించారు. సమావేశాలు సహా, డైనింగ్ తదితర అవసరాలకోసం మల్టిపుల్గా ఉపయోగించుకోవడానికి ఏర్పాటు చేసిన విశాలవంతమైన హాల్ను సీఎం పరిశీలించారు. నలుమూలలా కలియతిరిగిన సీఎం కేసీఆర్ సీఎం కార్యదర్శులు, ఇతర సిబ్బంది కార్యాలయాలను పరిశీలించారు. జీఏడి ప్రోటోకాల్ సిబ్బందికోసం ఏర్పాటు చేసిన చాంబర్లను పరిశీలించారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ హాల్, ప్రజాప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన వెయిటింగ్ లాంజ్, వీఐపీల వెయిటింగ్ లాంజ్లను సీఎం పరిశీలించారు.
మంత్రులకు కేటాయించిన శాఖలు అన్నీ ఒక దగ్గర వుండే విధంగా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. ఆ మంత్రికి చెందిన అన్ని శాఖల సిబ్బంది ఒకే చోట వుంటే బాగుంటదని సీఎం అన్నారు. ఆయా శాఖలల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యకు అనుకూలంగా కార్యాలయాలుండాలని కేసీఆర్ అధికారులకు సూచించారు.
అనంతరం గ్రౌండ్ ఫ్లోర్కు చేరుకున్న సీఎం, దక్షిణ భాగం గుండా నడుచుకుంటూ అక్కడ నిర్మాణంలో వున్న పార్కింగ్ తదితర పనులను కేసీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి, వర్క్ ఏజెన్సీలకు, ఇంజనీర్లకు సీఎం కొన్ని సూచనలు చేశారు. అనంతరం సచివాలయం ప్రహారికి అంతర్గతంగా వున్న, బయట చుట్టూ నిర్మాణం చేస్తున్న రోడ్లను, పరిసరాలను పరిశీలించారు. సచివాలయం ముందు నుంచి, దక్షిణం నుంచి ఉత్తరం వైపు ట్యాంక్బండ్ మీదుగా వెళ్ళే మార్గాన్ని పరిశీలించారు. ఫ్లై ఓవర్ నుంచి, సచివాలయం ముందు నుంచి నెక్లెస్ రోడ్డు దిశగా సాధారణ ప్రజలు ప్రయాణించేందుకు విశాలంగా నిర్మితమౌతున్న రోడ్లను సీఎం పరిశీలించారు. సెక్రటేరియట్ లోపలకు వెళ్ళే ప్రధాన మార్గాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించారు. అనంతరం సెక్రటేరియట్ చుట్టూ తిరిగి పనుల పురోగతిని సీఎం పరిశీలించారు. తాను అనుకున్నట్టుగానే సచివాలయ నిర్మాణం పనులు పూర్తికావచ్చినందుకు కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ వెంట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రోడ్లు భవనాలు శాఖ అధికారులు శ్రీనివాస్ రాజు, గణపతి రెడ్డి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తదితరులున్నారు.